
పద్మశాలీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రులు పొన్నం, తుమ్మల
గన్ఫౌండ్రి (హైదరాబాద్): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి జీవో 9ని విడుదల చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం.. తెలంగాణ ఉద్యమం పరస్పరం పెనవేసుకున్నాయని కొనియాడారు.
రిజర్వేషన్లను కాపాడుకోవాలని, అందుకోసం బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. పద్మశాలీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే పద్మశాలీలతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కీర్తించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని, బతుకమ్మ చీరల తయారీతో కార్మికులు నిలదొక్కుకునేలా, చేనేత రంగానికి అండగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కార్పొరేషన్ చైర్మన్లు ఈ అనిల్, మెట్టు సాయికుమార్, అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు కామర్థపు మురళి, అవ్వారి భాస్కర్, జగన్నాథం, ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.