మామిడి తోటలో మృత్యువు కాటేసింది | Man Dies After Getting Electric Shock | Sakshi
Sakshi News home page

మామిడి తోటలో మృత్యువు కాటేసింది

Apr 18 2025 7:58 AM | Updated on Apr 18 2025 7:58 AM

Man Dies After Getting Electric Shock

విద్యుదాఘాతంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

శంషాబాద్‌లో యువ సాఫ్ట్‌వేర్‌ విషాదాంతం  

శంషాబాద్‌: బైక్‌పై వెళ్తున్న దంపతులకు రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో కనిపించిన మామిడి కాయలు ఆకర్షించాయి. వాటిని తెంపి తీసుకొస్తున్న క్రమంలో భర్త విద్యుదాఘాతంతో అక్కడికక్కడే అసువులు బాసిన విషాదకర ఘటన శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కె.చేతన్‌రెడ్డి (26) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య బిందు. మొయినాబాద్‌లోని భాస్కర లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీంపటా్ననికి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్‌ రైల్వేట్రాక్‌కు సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో విరగగాసిన మామిడి కాయలను చూసిన చేతన్‌రెడ్డి వాహనాన్ని నిలిపివేశాడు. 

తోటలోని మామిడికాయలు కోసుకు వస్తుండగా.. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్‌ఫార్మర్‌ తీగలు తగలడంతో చేతన్‌రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్త అచేతనగా పడి ఉండటాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు. సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు  నిర్ధారించారు. అక్కడికి వచి్చన శంషాబాద్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement