రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు
16 బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలకు టీజీఓ కేంద్ర సంఘం హర్షం
ఈహెచ్ఎస్, పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్ అమలుపై ఐదు కీలక తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్/కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు రూ.కోటి పైగా ఆర్థిక భద్రత కల్పించేలా 16 బ్యాంకులతో రాష్ట్ర ప్రభు త్వం అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోవడం చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుమారు 14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఇది గొప్ప భరోసానిస్తుందని, సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండిలోని ఓ గార్డెన్లో జరిగింది. ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ ప్రతినిధులు, 76 శాఖల ఫోరమ్ల నాయ కులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రసంగాన్ని నాయకులు స్వాగతించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. గత రెండేళ్లలో ఉద్యోగుల 64 డిమాండ్లలో దాదాపు 30 ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, పెన్షన్ బకాయిల వి డుదల, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రశంసించారు.
తీర్మానాలు
సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఐదు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
» ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేసి వైద్య సేవలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
» శివశంకర్ కమిటీ పీఆర్సీ నివేదికను తక్షణమే స్వీకరించి 42 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
» పెన్షనర్ల బకాయిలను వేగంగా విడుదల చేయడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించాలని కోరారు.
» 2024 జనవరి 1 నుంచి 2026 జనవరి 1 వరకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే మంజూరు చేయాలని తీర్మానించారు.
» కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, 2024 సెపె్టంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు


