‘షాదీ ముబారక్‌’ సొమ్ము కాజేశారు! 

Hyderabadi Complaint On Shaadi Mubarak Cheque Encashed In Chennai - Sakshi

లబ్ధిదారుడికి చెక్కు ఇవ్వకముందే డబ్బు డ్రా

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ లబ్ధిదారుడికి  ఇచ్చిన షాదీ ముబారక్‌ స్కీమ్‌ చెక్కు చెల్లకుండాపోయింది. ఇది జారీ కావడానికి ముందే తమిళనాడులో ఎన్‌క్యాష్‌ అయింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు... చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు ఈ ఏడాది జనవరిలో తన కుమార్తెకు వివాహం చేశాడు. నిరుపేద  కావడంతో షాదీ ముబారక్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు.

మంజూరు కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న బండ్లగూడ రెవెన్యూ అధికారులు చెక్కు అందించారు. దీన్ని బాధితుడు బ్యాంకులో డిపాజిట్‌ చేసినా ఎన్‌క్యాష్‌ కాలేదు. ఆరా తీయగా జనవరిలోనే ఈ చెక్కు చెన్నైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో ఎన్‌క్యాష్‌ (డబ్బు డ్రా ) అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులు ఆగిపోయిన బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేరం ఎలా జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top