
గ్రూప్–1తో వేలాది మందిభవిష్యత్ ముడిపడి ఉంది: హైకోర్టు
మూల్యాంకన సిబ్బందికిజవాబు పత్రాలు ఇచ్చారా?:
తెలుగులో రాసిన వారిలో ఎంతమంది ఎంపికయ్యారు?.. వివరాలు సమరి్పంచాలని టీజీపీఎస్సీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–1.. ఇది చాలా సీరియర్ అంశం. ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. మళ్లీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఆస్తులు అమ్ముకుని కొందరు, కుదవపెట్టుకుని మరికొందరు ఏళ్లుగా శిక్షణ పొందుతున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా న్యాయస్థానం సహించదు’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష ముల్యాంకనం చేసిన వారికి జవాబు పత్రాలు ఇచ్చారా?.. దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారెందరు?.. తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?.. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఆదేశించారు.
గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రూప్–1 పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సురేందర్, విద్యాసాగర్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఆ సెంటర్లను ఎలా ఎంపిక చేశారు..
‘ప్రిలిమ్స్, మెయిన్స్కు హాల్ టికెట్లు మార్చారు. కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే ఇలా చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఎక్కడ ఏ పరీక్ష నిర్వహించినా ఇలా హాల్టికెట్ల నంబర్లలో మార్పు ఉండదు. ఎంపిక చేసిన మహిళా అభ్యర్థులను సెంటర్ నంబర్ 18, 19లో వేశారు. ఈ రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థులను ఎలా ఎంపిక చేసి, సెంటర్లు ఇచ్చారో చెప్పాలి. మరికొన్ని చోట్ల మహిళా కాలేజీల్లో సెంటర్లు కేటాయించినా అక్కడ పురుషులు, మహిళా అభ్యర్థులను వేశారు.
మొత్తం పోస్టుల్లో 4 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించగా, కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదు. 16, 17, 18, 19లో పరీక్ష రాసిన వారు ఎక్కువ శాతం అర్హత సాధించారు. పక్కపక్కనే కూర్చున్న వందలాది మందికి ఒకేలా మార్కులొచ్చాయి. అధికారిక వెబ్సైట్లో మొత్తం మార్కుల జాబితా మార్చి 10న పెట్టగా.. పేపర్ల వారీగా మార్కులను మాత్రం వారం తర్వాత పెట్టారు. ఇదంతా అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఆస్కారం ఇస్తోంది’అని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొన్నారు.
జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదు
తెలుగు, ఆంగ్లం, ఉర్దూ.. మీడియం వారీగా దిద్దేవారికి జవాబు పత్రాలు ఇచ్చారా అని టీజీపీఎస్సీ కౌన్సెల్ రాజశేఖర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. మెయిన్స్ వ్యాస రూపంలో జరుగుతుందని, ఈప్రశ్నలకు జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యంకాదని బదులిచ్చారు. సబ్జెక్టు నిపుణులే పేపర్లు దిద్దుతారని.. వారికి జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హులైతే అభినందించాలని ఆయన కోరగా.. న్యాయమూర్తి తప్పుకుండా అని సమాధానమిచ్చారు.
పిటిషన్లు వేసిన వారు నిరుద్యోగులు కాదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులని రాజశేఖర్ చెప్పారు. కాగా, గ్రూప్–1 నియామకాలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ దాఖలుచేసిన అప్పీల్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తోసిపుచ్చింది.