పోలీసు అభ్యర్థులను ఊరిస్తున్న ఖాళీలు

Govt May Releases Notifications In Police Department Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో పోలీసు శాఖలో కొలువుల భర్తీ కానున్నా యి. దాదాపు 20వేల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ మేరకు పోలీసు శాఖలోని ఆయా విభాగాల్లోని ఖాళీలను పోలీసు శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మేరకు దాదాపు 19,400లకుపైగా వరకు పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానుంది. గతేడాది 18వేలకు పైగా పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి గతం కంటే దాదాపు వెయ్యి పోస్టులు అధికంగానే రానున్నాయి. కిందటి సారి ఎస్సై, కానిస్టేబుల్‌ జాబులకు దాదాపు 6 లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కనిష్టంగా 6 లక్షలు గరిష్టంగా 8 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. 

పోస్టులు ఇవే! 
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ పరిధిలోని ఖాళీలపై నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం.. ఎస్సై మొత్తం 425 పోస్టులు కాగా, అందులో సివిల్‌ 368, ఏఆర్‌ 29, కమ్యూనికేషన్స్‌ 18 ఉన్నాయి. కానిస్టేబుళ్ల విషయానికి వస్తే సివిల్‌ 7,664, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ 6,783, టీఎస్‌ఎస్పీ 3,700, 15వ బెటాలియన్‌ 561, కమ్యూనికేషన్‌ 320. మొత్తంగా 19,453 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించింది. వీటిలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇవ్వనుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. 

గురి పెడితే జాబ్‌ రావాల్సిందే.. 
ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగానికే వేలాది మందితో పోటీ పడాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ తాకిడి మరింత అధికంగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు వేలు, లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. అయితే పోలీస్‌ భర్తీలో ఈసారి ఒక్కో పోస్టుకు బరిలో నిలిచేది 32 మందే. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. అందుకే కాస్త కష్టపడితే బరిలో నిలిచి కోరుకున్న కొలువు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతి దశలోనూ పోటీ తగ్గు ముఖం! 
దరఖాస్తు ప్రక్రియకు ఈ సారి ఆరు లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. అంటే పోస్టుకు తొలుత 32 మంది పోటీ పడ్డా.. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్తున్న కొద్దీ పోటీ అంతకంతకూ తగ్గుతూ వెళ్తుంది. తొలుత నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు 6 లక్షల మందిలో 99 శాతం మంది హాజరవుతారు. ఫలితాల అనంతరం 60 శాతం మందికిపైగా అనర్హులవుతారు. దీంతో మిగిలిన వారే పోటీలో ఉంటారు. అంటే పోటీ 15 మందికి కాస్త అటూఇటూగా వస్తుంది. ప్రిలిమినరీ అనంతరం నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్‌ తర్వాత పోటీ దాదాపు 25 శాతానికి తగ్గుతుంది. అంటే దాదాపు పోస్టుకు ఏడుగురితో పోటీ పడుతూ.. మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి దశలోనూ 50% పోటీ తగ్గుతూ వస్తుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే.. అతి తక్కువ మందిని వెనక్కి నెట్టి కొలువు సాధించొచ్చని పలువురు పోలీసులు, పరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top