డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని, వాటితో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి అజహ రుద్దీన్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మైనార్టీ సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా భారీ స్థాయిలో ‘ముషాయిరా’ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 20 పాఠశాలలు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.
మైనార్టీ యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. అలాగే క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లను కేటాయించి, యువతకు ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. మొహరం వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకా వాలని మంత్రి అజహ రుద్దీన్ కోరగా భట్టి సాను కూలంగా స్పందించారు.
మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించిన భట్టి
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను గురువారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు నాణ్యమైన భోజనం అందజేయడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రసాద్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ పాటిల్, డైరెక్టర్లు చక్రపాణి, శివాజీ, నరసింహ ఉన్నారు.


