‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ చక్కర్లు | Fact Check: False News Spread All Over Telangana About Earthquake | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ‘మళ్లీ భూకంపం వస్తోందంట’.. వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ చక్కర్లు

Dec 4 2024 2:24 PM | Updated on Dec 4 2024 5:04 PM

Fact Check: False News Spread All Over Telangana About Earthquake

జయశంకర్, సాక్షి:  ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్‌లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..

ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్‌ మీడియాలో ఓ వాయిస్‌ మెసేజ్‌.. వాట్సాప్‌ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. 

తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్‌ జోన్‌గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్‌ జోన్‌ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement