● ధ్వంసమైన పుష్కరఘాట్ రోడ్డుకు
నిధులు కరువు
ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం మండల పరిధిలోని పుష్కరఘాట్ మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90లక్షలు తాజాగా మంజూరు చేసింది. ఇరిగేషన్శాఖ ద్వారా ఇప్పుడు ఉన్నఘాట్కు అదనంగా మరో 50 మీటర్ల పొడువునా ఘాట్ నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేవలం మరమ్మతులు చేస్తే చాలు అన్నట్లుగా రూ.90 లక్షలు కేటాయించింది. ఇప్పటికే పలుమార్లు వచ్చిన గోదావరి ఉగ్రరూపానికి ఘాట్ కిందస్థాయి మేట్లు కూలిపోయి కొట్టుకుపోయాయి. 2015లో నిర్మించిన ఘాట్ పగుళ్లుబారి ఉంది. ఇక్కడ నూతనంగా ఘాట్ నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేవలం మరమ్మతులతో సరిపెట్టేలా ప్రభుత్వం తక్కువ నిధులు మంజూరు చేయడంతో భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉంది. అయినా భక్తులకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏజెన్సీ ప్రజలు మండిపడుతున్నారు.
శిథిలమైన పుష్కరఘాట్ రోడ్డు
జిల్లాలో ఒకటి రామన్నగూడెం, రెండోది మంగపేట పుష్కరఘాట్లు ఉన్నాయి. ఇందులోని ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కరఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డుపై నుంచి ఒక వాహనం వెళ్తే మరో వాహనం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోడ్డు నూతనంగా నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీనివల్ల పుష్కరాలకు వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డును తొలగించి నూతనంగా సీసీ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.


