
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఖైరతాబాద్: కరోనా రెండోసారి విస్తరించే ప్రమాదం లేకపోలేదని, చలికాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండో దశ ఢిల్లీలో ప్రారంభమైనట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద కోవిడ్ 19 జాగ్రత్తలపై పోస్టర్లు అతికిస్తున్నారు. రెండో దశ ప్రారంభమైతే ఎదురయ్యే పరిస్థితులు, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బంజారాహిల్స్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ షీమా రహా్మన్తో ‘సాక్షి’ ముఖాముఖి..
ప్ర: రెండో దశ మొదలైందా..?
జ: కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఢిల్లీలో మొదలైనటు తెలుస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే ఇంకా హైదరాబాద్లో మాత్రం ఆ దాఖలాలు లేవు. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా కష్టం. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పోస్టర్లను అతికిస్తున్నాం.
ప్ర: రోజుకు ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారు..?
జ: గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మా పరిధిలో 5,984 మందికి కరోనా పరీక్షలు చేయగా 523 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 99 శాతం మంది కోలుకున్నారు. ప్రతిరోజూ 50 కరోనా పరీక్షలు చేస్తున్నాం. తాజాగా గత నెల రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. నెల రోజుల్లో 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం అయిదు మందికి మాత్రమే పాజిటివ్గా తేలింది. ఆదివారం కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
ప్ర: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?
జ: కరోనా రెండో దశ విస్తృతం కాకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. మాస్క్ మాత్రమే ప్రతి ఒక్కరిని కరోనా సోకకుండా కాపాడుతుంది. అలాగే భౌతికదూరం పాటించండం కూడా ప్రధానమే. ఇటీవల పెళ్లిళ్లతో సహా పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున అతిథులతో నిర్వహిస్తున్నారు. ఇది ఆందోళనకరం. వ్యాక్సిన్ వచ్చే వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మేలు.
ప్ర: జాగ్రత్తల విషయంలో ప్రజలు ఎలా ఉంటున్నారు ?
జ: ఇటీవల గమనిస్తే బయటకు వచి్చనప్పుడు చాలా మంది మాస్్కలు ధరించడం లేదు. అంతే కాకుండా భౌతికదూరం కూడా పాటించడం లేదు. ఇది చాలా ప్రమాదకరం.
ప్ర: ఏ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి ?
జ: కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలి.