ఇప్పపువ్వు సారాకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్న బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు, వాకిటి
ఆ పదాలు తొలగించేలా స్పీకర్ రూలింగ్ ఇవ్వాలన్న శ్రీధర్బాబు
ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఇప్పపువ్వు సారా అంశం చర్చ తీవ్ర దుమారం రేపింది. ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమేకాక.. బీజేపీ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇందిరాగాంధీని అవమానించేలా మాట్లాడిన రాకేష్ రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ బాలూనాయక్ను శ్రీధర్బాబు కోరారు. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.
ఇప్పపువ్వుకు చేయూత ఇవ్వండి
ప్రత్యేక అంశంలో భాగంగా జడ్చర్ల శాసన సభ్యుడు అనిరు«ద్రెడ్డి ఇప్పపువ్వు సారా తయారీ, మార్కెటింగ్, టర్నోవర్పై ఉదాహరణలతో సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో ఉన్న ఇప్పపువ్వు చెట్ల ద్వారా 200 మెట్రిక్ టన్నుల ఇప్పపువ్వు ఉత్పత్తి అవుతోందన్నారు. దీంతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయొచ్చని, విదేశాల్లో ఇప్పటికే రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు.
దీనికి ప్రభుత్వం చేయూత ఇస్తే ఎన్నో గిరిజన కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందనగా.. పలువురు సభ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ కల్లు, ఆల్ఫ్రాజోలమ్ కలిపిన మత్తు పానీయాలు తాగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయనా లు లేని సాధారణ పద్ధతిలో తయారు చేసే ఇప్పపువ్వు సా రాను ప్రభుత్వం అనుమతించాలని సూచిస్తూ... ఈ ఉత్పత్తికి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దనడంతో సభలో దుమారం రేగింది.
వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్కలుగజేసుకుంటూ ఇందిరాగాంధీ పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఆమెను అవమానిస్తున్నా రని మండిపడ్డారు. సారా గురించి మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేరు ఎలా ప్రస్తావిస్తారని, తక్షణమే ఆయన సభకు క్షమాపణ చెప్పాలన్నారు. వాజ్పేయిలాంటి వ్యక్తి ఇందిరాగాం«దీని ఉక్కుమహిళగా ప్రస్తావించారని, అలాంటి మహి ళ పట్ల హేళనగా మాట్లాడటం అభ్యంతరకరమన్నారు.
ఆయన తీరు సరికాదు..
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మహిళల పట్ల ఆయనకు గౌరవం లేనట్టుందని, బాధ్యతగల పదవిలో ఉండి, సభలో ఇలా వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఇంతలో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి కలగజేసుకుంటూ రాకేశ్రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా బీజేఎల్పీ నేత వ్యవహరిస్తోన్న తీరు సరికాదని శ్రీధర్బాబు అన్నారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రాకేష్ రెడ్డికి సూచించారు. ఒక అంశాన్ని పట్టుకుని అదేపనిగా సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని, అభ్యంతరకరమైన అంశాలను స్పీకర్ తొలగించి సభను కొనసాగించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు సూచించారు.
ఇందిరమ్మ పేరునే కాదు.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడవద్దన్నారు. దీనిపై రాకేష్ రెడ్డి వివరణ ఇస్తూ తాను తప్పుగా మాట్లాడలేదని, సభ్యులు నొచ్చుకుని ఉంటే వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నానని, ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలనడంతో పరిస్థితి సద్దుమణిగింది.


