
కొంత నగదు చెల్లించాక విడుదల
ఖమ్మం జిల్లా: బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించకపోవటంతో అధికారులు సదరు వ్యక్తి గొర్రెలను జప్తు చేసిన ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడు తండాలో మూడు రోజుల కిందట జరిగింది. గోరీలపాడు తండాకు చెందిన బదావత్ లింగానాయక్ కూసుమంచిలోని డీసీసీబీ బ్రాంచ్లో రూ.50 వేల ముద్రా లోన్ తీసుకున్నాడు.
కొద్దినెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. దీంతో సోమవారం ఆయన ఇంటికి వెళ్లిన మేనేజర్ స్రవంతి, సిబ్బంది అప్పు చెల్లించాలని కోరగా స్పందించకపోవడంతో లింగానాయక్ ఇంట్లో ఉన్న రెండు గొర్రెలను జీపులో బ్యాంకుకు తీసుకొచ్చారు.
ఈమేరకు లింగానాయక్ బ్యాంకుకు వచ్చి రూ.10 వేలు చెల్లించి, మిగతా నగదు వాయిదాల్లో చెల్లిస్తానని చెప్పడంతో మేనేజర్ ఆయన గొర్రెలను ఆటోలో తండాకు పంపించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ స్రవంతిని వివరణ æకోరగా లింగానాయక్ రుణం సక్రమంగా చెల్లించకపోవంటంతో గొర్రెలు తీసుకొచ్చామన్నారు.