కల్లూరు రూరల్: కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ మంజూరైంది. త్వరలోనే 25 కంప్యూటర్లు, ఇతర పరికరాలు రానుండడంతో గదులను సిద్ధం చేస్తున్నారు. కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందేలా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ప్రిన్సిపాల్ వేముల శేఖర్ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించగా సానుకూల స్పందన లభించింది. ఈమేరకు ప్రభుత్వంతోపాటుగా దాతలు ముందుకొచ్చారు. ఈనేపథ్యాన త్వరలోనే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకానుంది.
కేయూ దూరవిద్యలో
ప్రవేశాల గడువు పొడిగింపు
ఖమ్మంసహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి సూచించారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రం నంబర్ 80088 11998లో కానీ కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో కానీ సంప్రదించాలని తెలిపారు.
6న జాబ్మేళా
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఏటీసీ)లో ఈనెల 6వ తేదీన అప్రెసింటిస్ షిప్, ప్లేస్మెంట్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. ఖమ్మం, హైదరాబాద్కు చెందిన పలు ప్రముఖ పరిశ్రమల బాధ్యులు పాల్గొని అప్రెంటిస్ షిప్, ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు అప్రెంటిస్షిప్ అడ్వైజర్ జి.రవి(99896 37594)ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
రేక్ పాయింట్కు 2,520 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆదివారం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,520 మెట్రిక్ టన్నుల యూరియా, 127.6 అమ్మోనియం సల్ఫేట్ చేరింది. యూరియాను ఖమ్మం జిల్లాకు 1,020 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఓఏ డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మె. టన్నుల యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేశామని వెల్లడించారు.


