ఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద ఆదివారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ లైట్లు అమర్చే పనులు జరుగుతుండడంతో భారీ వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవేపై కొంతదూరం ప్రయాణించి పరిశీలించారు. కాగా, హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించినా, ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమం మాత్రం ఉండదని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాక టోల్ఫీజు వసూలు మమొదలవుతుందని వెల్లడించారు.
ఇన్నాళ్లు సోమవరం వద్ద...
హైవే పనులు కొద్ది నెలల క్రితమే పూర్తయినా ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఆలస్యమైంది. దీంతో వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసలాపురం వద్ద బ్రిడ్జితో పాటు ఎగ్జిట్ నిర్మాణ పనులు, ఇతరత్రా అన్ని పూర్తవడంతో తల్లంపాడు ఎంట్రీ పాయింట్ నుంచి అనుమతిస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారికి దూరం, సమయం తగ్గనున్నాయి.
ఖమ్మం – దేవరపల్లి హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మల


