అన్నారం బ్యారేజీ ఖాళీ  | Annaram barrage is empty | Sakshi
Sakshi News home page

అన్నారం బ్యారేజీ ఖాళీ 

Feb 19 2024 4:05 AM | Updated on Feb 19 2024 2:56 PM

Annaram barrage is empty - Sakshi

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం(సరస్వతీ) బ్యారేజీలో మరమ్మతుల కోసం ఇంజనీరింగ్‌ అధికారులు గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేశారు. బ్యారేజీ సమగ్ర సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆదివారం వరకు బ్యారేజీలోని 10–15 గేట్లు ఎత్తి పూర్తి నీటిని రెండువేల క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు.

నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్‌్టల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం.  

తడి ఆరిన తర్వాతే సర్వే: నీటిని పూర్తిగా తొలగించిన అధికారులు బ్యారేజీ దిగువన తడి ఇసుక, రేగడి మట్టితో దిగబడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎండిన తరువాతనే సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 2.01 టీఎంసీలు నీటి నుంచి 10–15 గేట్లు ఎత్తగా 2వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలించారు.

నీరు ఖాళీ కావడంతో ర్యాప్‌్ట, పియర్‌లు దిగువ వేసిన సీకెంట్‌ ఫైల్స్‌ కింది భాగంలో ఏమైనా లీకేజీలు ఉన్నాయా.. ఫౌండేషన్‌ ఎగువ నుంచి ప్రారంభమై దిగువన ఎక్కడకు వెళ్తుంది.. కింద ఖాళీ ఉందా.. తెలుసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఒప్పందం మేరకు పార్సన్‌ అనే సంస్థ గ్రౌండ్‌ పెనట్రేషన్‌టెస్ట్‌ కోసం సర్వే చేయనుంది. ఈ సర్వే పూర్తయ్యాక ప్రత్యేక రసాయనాలతో తిరిగి మరమ్మతులు చేపట్టనున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement