‘విజయ్‌’ వరాల జల్లు | - | Sakshi
Sakshi News home page

‘విజయ్‌’ వరాల జల్లు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● మేనిఫెస్టో విడుదల ● 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం ● యువతుల వివాహానికి తులం బంగారం ● వెట్రి మహిళా పథకం: 60 ఏళ్లలోపు ప్రతి కుటుంబ పెద్ద (మహిళ) బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2500 జమ చేయబడుతుంది. ● బంగారం – పట్టుచీర: పేద యువతుల వివాహానికి 8 గ్రాముల (ఒక తులం) బంగారం , పట్టుచీర అందజేత. ● విద్యార్థుల తల్లులకు సాయం: 12వ తరగతి వరకు విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకు, వారి తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం పంపిణి. ● ఉన్నత విద్య కోసం రుణం: 12వ తరగతి తర్వాత పీహెచ్‌డీ వరకు చదువుకునే విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం. ● నిరుద్యోగ భృతి: 29 ఏళ్లు పైబడి ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, ఇంటర్‌ చదివిన వారికి రూ. 2,500 నెలవారీ భృతి పంపిణి ● ఉచిత గ్యాస్‌ సిలిండర్లు: ఏడాదికి 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ ● రైతులకు రుణమాఫీ: 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తి పంట రుణమాఫీ. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి 50% రుణమాఫీ. ● ఉచిత విద్యుత్‌ : ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ● ఆరోగ్య భీమా: ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్‌ ఇన్సూరెనన్స్‌ ● మద్దతు ధర: క్వింటాల్‌ వరి ధర రూ. 3,500, టన్ను చెరకు ధర రూ. 4,500 గా నిర్ణయం. ● వ్యవసాయ కూలీలకు సాయం: కౌలు రైతులు , వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సాయం.

ప్రధాన వాగ్దానాలు

సాక్షి, చైన్నె : తమిళగ వెట్రికళగం ఓటర్లకు వాగ్దానాల వాన కురిపించింది. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థుల సమక్షంలో టీవీకే అధినేత విజయ్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. గృహాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం అన్న కీలక ప్రకటనను విజయ్‌ చేశారు. వివరాలు.. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 234 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టగా, ఓ చోట నామినేషన్‌ తిరస్కరణకు గురి అయింది. మిగిలిన చోట్ల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి మద్దతుగా విజయ్‌ జిల్లా కేంద్రాలలోని నియోజకవర్గాలను కలుపుతూ ప్రచార సభలు,రోడ్‌ షోలతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో తిరుప్పూర్‌, కన్యాకుమారి వంటి ప్రచార సభలలో కొన్ని ఆసక్తికర వాగ్దానాలను విజయ్‌ ప్రకటించారు. నేతన్న, రైతన్నల అభ్యున్నతిని కాక్షించే విధంగా వరాలు జల్లులు కురిపించారు. నేతన్నల కోసం ‘ఈ–కామర్స్‌’ విప్లవం, చేనేత రంగం కోసం ప్రభుత్వ ఈ–కామర్స్‌ పోర్టల్‌ను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి నూలు ,రంగుల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అంతే కాదు, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకుంటూ, రోటెటింగ్‌ పద్దతిలో సెలవులు అందజేస్తామని ప్రకటించి ఉన్నారు. అలాగే, రాష్ట్రంలో ఏ పార్టీ ఊహించని రీతిలో ఏఐ విప్లవాన్ని అనుకూలంగా మలచుకునేందుకు సైతం వాగ్దానాలు కురిపించారు. టీవీకే అధికారంలోకి రాగానే శ్రీతమిళనాడు సేవ ధృవీకరణ పథకం తో ఒక మొబైల్‌ యాప్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్స్‌తో సహా అన్ని ప్రభుత్వ సేవల కల్పన, జాలర్ల భద్రతకు భరోసాగా నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంపు, కడల్‌ తాయ్‌ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామని విరించారు. అలాగే, ఆధునిక యుగానికి అనుగుణంగా ఏఐ శాఖను సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోను గురువారం సాయంత్రం చైన్నెలో విడుదల చేశారు.

మేనిఫెస్టో విడుదల

మేనిఫెస్టో తొలి ప్రతిని రైతు నారాయణన్‌కు విజయ్‌ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో తిరుక్కురళ్‌లోని అరమ్‌, పొరుళ్‌, ఇన్బమ్‌ ఆధారంగా రూపొందించబడిందన్నారు. తాము చేయగలిగినవి మాత్రమే ఇందులో చెప్పామని, ఇతరుల మాదిరిగా ప్రజలను మోసం చేయమని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement