కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటింగ్ గురువారం నిఘా నీడలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత పూరిత వాతావరణంలో పోలింగ్ను అధికారులు విజయవంతం చేశారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన తమ ప్రాధమిక హక్కును వినియోగించుకున్నారు.
సాక్షి, చైన్నె : 30 అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య సమరం నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఇక్కడ విజయ్ టీవీకే, సీమాన్ ఎన్టీకే అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో మొత్తం 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుదుచ్చేరిలో మొత్తం 9,50,311 మంది ఓటర్లలో 5.03 లక్షల మంది మహిళలు, 4.4 లక్షల మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,099 ఈవీఎంలను ఉపయోగించారు.అదనంగా 364 ఈవీఎంలను ముందు జాగ్రత్తగా సిద్ధం చేసి ఉంచారు. ఈ పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 7 గంటలకు అన్నిపార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం బాక్సులకు ఉన్న సీల్స్ను తొలగించి ఎన్నికల ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి ఓటింగ్లో మహిళలు,యువత పెద్దసంఖ్యలో ఉత్సాహంగా తరలి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకు 37 శాతం, మధ్యాహ్నానికి 50 శాతం ఓటింగ్ దాటడం గమనార్హం. 3 గంటలకు 70 శాతం చేరు కోగా, సాయంత్రం 5 గంటలకు 86 శాతంగా నమోదు కావడంతో 90 శాతంకు పైగా నమోదు కావచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. కారైక్కాల్ దక్షిణం నియోజకవర్గంలో వీవీ ప్యాట్ నుంచి శబ్దం, పొగ రావడంతో కలకలం బయలు దేరింది. వెంటానే దానిని మార్చేశారు. అలాగే, రాజ్ భవన్ నియోజకవర్గంలో ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయలేదని ఎన్నికల కమిషన్పై బీజేపీ అభ్యర్థి రామలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్– ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పని పెట్టారు. నిఘా నీడలో , చెదురుముదురు ఘటనల మినహా ఎన్నికలను విజయవంతం చేశారు.నాలుగు వేల మంది ఎన్నికల సిబ్బంది, పది వేలకు పైగా పోలీసులు భద్రతా విధులను నిర్వర్తించారు. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ అనేక పోలింగ్ బూత్లలోముగిశాయి. కొన్ని చోట్ల ఆరు గంటలలోపు వచ్చిన వారికి టోకెన్లు అందజేసి ఓటింగ్కుఅ వకాశం కల్పించారు. మొత్తానికి...... శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఓ యువకుడు తాను ఎవరికి ఓటు వేశానోనని ఫొటో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయడం చర్చకు దారి తీసింది.
ఆకట్టుకున్న ’మోడల్’ పోలింగ్ కేంద్రాలు
ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేసింది. పుదుచ్చేరి, కారైకాల్లలో మూడు ’ప్రత్యేక గుర్తింపు’ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వీఓసీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చే వారికి నీల పేరిట ఓ రోబో పూలు ఇచ్చి స్వాగతం పలికే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఈ కేంద్రాలను అరటి చెట్లు, తోరణాలు , కొబ్బరి ఆకులతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఓటర్లకు మజ్జి, మందార టీ అందిస్తూ, పన్నీరు చల్లి మరీ గౌరవించారు.
ఓట్లు వేసిన ప్రముఖులు
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటు వేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్నాథన్ తన సతీమణితో కలిసి ఆరోగ్య శాఖడైరెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ముందుగా ఆయన సతీమణికి ఎన్నికల సిబ్బంది సిరా పెట్టడం మరిచినట్టు, తేరుకుని ఆ తర్వాత వేలికి సిరా పెట్టినట్టుగా ప్రచారం ఊపందుకుంది. పుదుచ్చేరి పౌరులందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ కోరారు. మిషన్ స్ట్రీట్లోని పాఠశాలలో మాజీ సీఎం నారాయణ స్వామి ఓటు వేసినానంతరం మాట్లాడుతూ, పుదుచ్చేరిలో కాంగ్రెస్–డీఎంకే కూటమికి ప్రజల మద్దతు విపరీతంగా ఉందని చెప్పారు. స్టాలిన్, రాహుల్ గాంధీ ప్రచారం ప్రజల్లో మార్పు తెచ్చిందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విల్లియనూరులో ప్రతిపక్ష నేత, డీఎంకే అభ్యర్థి శివ ఓటు వేసినానంతరం మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, స్టాలిన్ ప్రచారం పెద్దఎత్తున ప్రభావం చూపిందని వ్యాఖ్యలు చేశారు. మనవెలి బీజేపీ అభ్యర్థిగా ఉన్న స్పీకర్ ఎన్బళం సెల్వం తవళకుప్పంలో ఓటు వేశారు.రెడ్డియార్ పాళయంలో లక్ష్య జననాయగ కట్చినేత జోస్ చార్లెస్ మార్టిన్ ఓటు వేశారు. కాగా, పుదుచ్చేరి ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.


