
క్లుప్తంగా
అదనపు వసతులకు చర్యలు
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కొత్త బస్టాండ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశా రు. ముందుగా ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు సిద్ధంగా ఉంచాలన్నారు. బస్టాండ్లో మెడికల్ దుకాణాలు ఏర్పాటుకు టెండర్లు పిలవాలన్నారు. బస్టాండ్కు వచ్చే బస్సులను ప్రతి ఏడాది రెన్యూవల్ చేసే సమయంలో వాటి కండిషన్ను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా బస్టాండ్లో ప్రయాణికుల విశ్రాంతి గది, బిడ్డ తల్లులకు పాలిచ్చే గది, ప్రయాణికుల సంరక్షణ గది ఏర్పాటు చేసి వాటికి అవసరమైన ఫ్యాన్ను ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లో ద్విచక్ర వాహనాలు నిలపకుండా చూడాలన్నారు. కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, ఎంవీఐ తంగరాజన్, తహసీల్దార్ వడివేల్ పాల్గొన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తూత్తుకుడి న్యూపోర్టు థర్మల్ నగర్ లేబర్ కాలనీకి చెందిన హరిచంద్రన్, మురుగేశ్వరి దంపతులు. వీరి కుమార్తె దర్శిని (18). తన అమ్మమ్మ సంరక్షణలో పెరిగుతున్న ఈమె ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దర్శిని తూత్తుకుడిలోని ముదియపురంలోని రాజీవ్నగర్కు చెందిన ఒక విద్యార్థితో చనువుగా ఉన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితిల్లో మంగళవారం, ఇంట్లో ఒంటరిగా ఉన్న దర్శిని, ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన ఆమె చెల్లెలు ఇది చూసి వెంటనే థర్మల్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మెట్రో స్తంభాన్ని ఢీకొన్న బైక్
– యువకుడి దుర్మరణం
తిరువొత్తియూరు: అలందూర్లోని అసర్ఖాన మలుపు వద్ద మెట్రో రైలు స్తంభాన్ని బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. చైన్నె తాంబరం హస్తినాపురం జైన్ నగర్కు చెందిన కిషోర్ (18). అదే ప్రాంతం నేతాజీ వీధికి చెందిన యోనేష్. స్నేహితులైన వీరిద్దరూ మంగళవారం హస్తినాపురం నుంచి జీఎస్టీ రోడ్డు మీదుగా కత్తిపారకు బైక్లో వెళుతున్నారు. అలందూర్లోని అసర్ఖాన ప్రాంతంలోని మలుపు వద్ద వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి మెట్రో రైలు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం అందుకున్న పరంగిమలై పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణాలతో పోరాడుతున్న యోనేష్ను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టు ఉద్యోగి దారుణ హత్య
అన్నానగర్: ప్రేమ వివాదాన్ని పరిష్కరించిన కోర్టు ఉద్యోగిని తిరువారూర్ సమీపంలో దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూర్ జిల్లాలోని కూత్తానల్లూరు నివాసి మహ్మద్ఆడం (21) తెన్కాసిలో డ్రైవర్. ఇతను తిరువారూర్ సమీపంలోని పులివలంకు చెందిన మోహన్ కుమార్తె సౌమ్య (21)ను ప్రేమిస్తున్నాడు. కానీ ఇటీవల సౌమ్య, మహ్మద్ ఆడంతో మాట్లాడడం మానేసింది. దీంతో మహ్మద్ ఆడం బంధువులైన మహ్మద్ నస్రుద్దీన్ (23), హాజీమహ్మద్ (23)లను సోమవారం రాత్రి ఇంటికి పంపించాడు. అక్కడ సౌమ్య తమ్ముడు గోపీకృష్ణన్ (19)తో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో తిరువూరు సమీపంలోని ధ్యానపురం నుంచి సంతోష్కుమార్ (28) సౌమ్య ఇంటి సమీపంలోని స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఇతను జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సౌమ్య ఇంట్లో జరుగుతున్న గొడవను చూసి అతను అక్కడికి వెళ్లి రాజీ చేసి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన మహ్మద్ ఆడమ్ వర్గీయులు కత్తితో సంతోష్ కుమార్పై దాడి చేశారు. సంతోష్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై తిరువారూర్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, హాజీ మహ్మద్, మహ్మద్ నస్రుద్దీన్లను అరెస్టు చేసి, పరారీలో ఉన్న మహ్మద్ ఆడం కోసం గాలిస్తున్నారు.
మహిళకు లైంగిక వేధింపులు
– నిందితుడి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె కొత్త చాకలిపేట ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ 26వ తేదీ రాత్రి ఇంటిలో నిద్ర పోతున్నారు. ఆ సమయంలో తెల్లవారుజామున (27వ తేదీ) తెల్లవారుజామున, పక్క.ఇంటిలో నివసిస్తున్న పరిచయం లేని వ్యక్తి బాల్కనీ మార్గం ద్వారా ఇంటిలోకి చొరబడి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ మేల్కొని శబ్దం చేయడంతో అతను పారిపోయాడు. బాధిత మహిళ ఈ సంగతి గురించి కొత్త చాకలిపేట పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లైంగిక వేధింపులు కేసు చట్టం తమిళనాడు మహిళలపై అత్యాచారాల నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహించి, దీపక్ కుమార్ ( 37) ను మంగళవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. దర్యాప్తులో, దీపక్ కుమార్ కొత్త చాకలిపేటలో ఒక బేకరీలో పనిచేస్తున్నట్టు తెలిసింది.