
ఐఏఎస్ల మెడకు అవినీతి ఉచ్చు
● ఐఎఎస్ల మెడకు అవినీతి ఉచ్చు...! ●ముగ్గురిపై కేసు నమోదుకు ధర్మాసనం ఆదేశం ●గతంలో విడుదల చేయడంపై విచారణ ●రంగంలోకి ఏసీబీ
సాక్షి, చైన్నె: పాడి పరిశ్రమల శాఖలో గతంలో జరిగిన అక్రమాలు ఇద్దరు ఐఏఎస్ల మెడకు ఉచ్చుగా మారింది. వీరితో పాటు మరొకరిపై కేసు నమోదు చేసి పునఃవిచారణకు మదురై ధర్మాసనం న్యాయమూర్తి పుహలేంది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో జరిగిన తనిఖీల్లో పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. రూ.1.75 కోట్లు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి పాడిపరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి కామరాజ్, కమిషనర్గా ఉన్న వల్లలార్లతో పాటు అదనపు కమిషనర్ క్రిస్తుదాసులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2023లో ఐఏఎస్లకు క్లీన్చిట్ వచ్చింది. ఈ కేసు నుంచి ఐఏఎస్లు బయట పడ్డా, క్రిస్తుదాసు మాత్రం ఎదుర్కొంటూ వచ్చారు.
నన్ను కూడా విడుదల చేయండి..
ఈ కేసు నుంచి ఇద్దరు ఐఎఎస్లు విడుదలైనా, తనను మాత్రం ఈకేసును ఎదుర్కొనేలా చేయడాన్ని వ్యతిరేకిస్తూ, తనను కూడా విడుదల చేయాలని మదురై ధర్మాసనంలో క్రిస్తుదాసు పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, పనిచేశానని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా శుక్రవారం న్యాయమూర్తి పుహలేంది తీవ్రంగానే స్పందించారు. ఐహేఎస్ల మీద అనేక కేసులు దాఖలు అవుతున్నా, చివరకు విడుదలు కావడం పరిపాటిగా మారుతోందని వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్లను ఈకేసులో విడుదల చేసి, క్రిస్తు దాసును మాత్రం విచారణ ఎదుర్కొనేలా చేయడంలో కారణం ఏమిటో అని ప్రశ్నించారు. క్రిస్తుదాసు పిటిషన్ విచారణను తోసిపుచ్చారు. అదే సమయంలో కీలక ఉత్తర్వులను ఏసీబీకి జారీ చేశారు. కేసుల నుంచి విడుదలైన తర్వాత కూడా మంత్రులే మళ్లీ విచారణలను ఎదుర్కొంటున్నప్పుడు, ఐఏఎస్లకు మినహాయింపు ఉండబోదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్లకు క్లీన్చిట్ ఇవ్వడంపై విచారణ జరపాలని కేంద్ర అవినీతి నిరోధక శాఖ కమిషన్ను ఆదేశించారు. అలాగే, ఈ అక్రమాల వ్యవహారంలో పునః విచారణకు ఏసీబీని ఆదేశించారు. ఐఎఎస్లు ఇద్దరితోపాటు క్రిస్తుదాసుపై మళ్లీ కేసుల నమోదుతో విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.
మదురై ధర్మాసనం

ఐఏఎస్ల మెడకు అవినీతి ఉచ్చు