
జూలైలో అమిత్షా పర్యటన
సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా జూలైలో తమిళనాడులో పలు పర్యటనలకు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లలో కమలనాథులు ఉన్నారు. తమిళనాట బలోపేతం దిశగా అమిత్ షా ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు కావడంతో, ఇక, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకే పార్టీలను అక్కున చేర్చుకునే దిశగా వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళనాట ఈ సారి అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్న అమిత్షా జూలైలో తమిళనాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకోసం పలు కార్యక్రమాలకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మదురై వేదికగా మురుగన్ మహానాడుకు సర్వం సిద్ధం చేసిన కమలనాథులు, ఈ మహానాడు విజయం తర్వాత అమిత్షా పర్యటనల కసరత్తులను వేగవంతం చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
8 విమానాలు రద్దు
కొరుక్కుపేట: చైన్నె–ఢిల్లీ, ముంబయి, తూత్తుకుడి, హైదరాబాద్ మధ్య నడిచే ఎనిమిది విమానాలు రద్దు అయ్యాయి. దీంతో చైన్నె విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. చైన్నె నుంచి ముంబయికి ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఢిల్లీకి ఉదయం 9.45 గంటలకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం, ఉదయం 10.10 గంటలకు చైన్నె నుంచి తూత్తుకుడికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం, చైన్నె నుంచి డిల్లీకి రాత్రి 8.40 గంటలు వెళ్లాల్సిన ఎయిండియా విమానాలు రద్దు చేశారు. అలాగే శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు చైన్నెకు చేరుకోవాల్సిన స్పైస్ జెట్ విమానం, ఉదయం 9.05 గంటలకు ఢిల్లీ నుంచి చైన్నె చేరుకోవాల్సిన ఎయిండియా ప్యాసింజర్ విమానం, మధ్యాహ్నం 1.45 గంటలకు తూత్తుకుడి నుంచి చైన్నె చేరుకోవాల్సిన స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానం, రాత్రి 7.10 గంటలకు ఢిల్లీ నుంచి చైన్నె చేరుకోవాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
కోర్టుకు రండి!
– సీఎస్కు ఆదేశాలు
సాక్షి, చైన్నె: కారుణ్య నియామక కేసులో కోర్టుకు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కారం కింద 2023 నుంచి సీఎస్లుగా పనిచేసిన వారికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో మరణించే ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద వారి అర్హతల ఆధారంగా వివిధ పోస్టులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కారుణ్య నియామకాలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం జరగాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కారుణ్య నియామకానికి సంబంధించి ఉద్యోగం కోసం దాఖలైన కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ తాజా బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. 2023లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా బెంచ్ పరిగణించింది. శుక్రవారం విచారణ సమయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారంగా పరిగణించి 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారిని స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 21వ తేదీకి వాయిదా వేసింది.
రాందాసుతో మనవరాళ్ల భేటీ!
సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పెద్దలు, కుటుంబపెద్దలు, ముఖ్యులు, శ్రేయాభిలాషుల బుజ్జగింపునకు తలొగ్గని రాందాసు, తన మనవరాళ్ల భేటీతో తగ్గే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బమణి మధ్య అధ్యక్ష పదవి విషయంగా వివాదం బుల్లి తెర ధారా వాహికను తలపించే విధంగా పలు ఎపిసోడ్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాందాసును అనేక మంది బుజ్జగించారు. అన్బుమణి క్షమాపణలు చెప్పుకున్నా, స్వయంగా కలిసి క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రకటించినా రాందాసు ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో చైన్నెలో ఉన్న రాందాసు మనవరాళ్లు, అన్భుమణి కుమార్తెలు కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని గంటల పాటు ఈ భేటీ జరగడంతో మున్ముందు పరిస్థితులు సద్దుమణగవచ్చు అనే చర్చ పీఎంకేలో నెలకొంది.