
చెరుకు సాగుపై సమీక్ష
కొరుక్కుపేట: తమిళనాడులో చెరుకు సాగు, చక్కెర మిల్లుల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాలను వేగవంతం చేయడం పై రాష్ట్ర పర్యాటక, సహకారశాఖా మంత్రి రాజేంద్రన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో సహకార, ప్రభుత్వ రంగ చక్కెర మిల్లుల కార్యదర్శులు, ఆ శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ సీఎం స్టాలిన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెరుకు సాగును పెంచడానికి, చక్కెర మిల్లుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల కారణంగా చెరుకు సాగు విస్తరిస్తుందని అన్నారు. చక్కెర మిల్లుల సామర్థ్యం కూడా పెరుగుతోంది. చెరుకు రైతుల సంక్షేమం, చక్కెర మిల్లుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 2024–25లో మిల్లింగ్ సీజన్కు చెరుకు సరఫరా చేసిన రైతులకు ప్రకటించిన టన్నుకు రూ.349 ప్రత్యేక ప్రోత్సాహకాన్ని వేగవంతం చేయడానికి అందరు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపైనా ఆయన అధికారులతో సమీక్షించారు.