
ఈడీకి చెక్!
●ఆకాశ్, విక్రమ్కు ఊరట ●అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ●టాస్మాక్ స్కాంలో మలుపు
సాక్షి, చైన్నె : టాస్మాక్ స్కాం మలుపు తిరిగింది. ఈడీ దూకుడుకు చెక్ పెడుతూ మద్రాసు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేసుతో సంబంధం ఉన్నట్టుగా ఈడీ భావిస్తున్న సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పారిశ్రామిక వేత్త రవీంద్రన్లకు ఊరట కలిగిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. చైన్నెలోని తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ప్రధాన కార్యాలయంలో మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలు, కొనుగోలు, టెండర్ల ప్రక్రియలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈసోదాల్లో రూ.1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు సమాచారం. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ సైతం దూకుడు పెంచింది. అధికారులను టార్గెట్ చేసింది. అదే సమయంలో సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పవిక్రమ్ రవీంద్రన్లను సైతం ఈడీ టార్గెట్ చేసింది. వారి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు జరిగాయి. వాటికీ సీల్ వేశారు. కంప్యూటర్లు ల్యాప్ టాప్లను పట్టుకెళ్లారు.
కోర్టు రూపంలో అక్షింతలు
టాస్మాక్ వ్యవహారాలతో తమకు సంబంధం లేదంటూ ఈడీ తదుపరి చర్యలకు వ్యతిరేకంగా ఆకాశ్ భాస్కరన్, విక్రమ్ రవీంద్రన్లను మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గత వారం రోజులుగా ఈ కేసు విచారణవాడి వేడిగా జరుగుతూ వచ్చింది. శుక్రవారం తుది విచారణ జరిగింది. అయితే, టాస్మాక్ స్కాం వ్యవహారంలో ఆకాశ్, విక్రమ్లకు సంబంధం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించక పోవడాన్ని న్యాయమూర్తులు రమేష్, లక్ష్మీనారాయణ బెంచ్ తీశ్రంగా పరిగణించింది. వారి కార్యాలయాలకు వేసిన సీల్ తొలగిస్తామని, కంప్యూటర్లు అప్పగిస్తామని ఈడీ హామీ ఇచ్చింది. అయితే, టాస్మాక్తో వీరికి ఉన్న సంబంధం ఏమిటో ...? అని పదే పదే విచారణ సమయంలో న్యాయమూర్తులు ప్రశ్నించినా, సమాధానం , ఆధారాలు ఈడీ సమర్పించక పోవడం గమనార్హం. చివరకు ఈడీకి అక్షింతలు తప్పలేదు. ఆధారాలు లేనప్పుడు సోదాలు చేసే అధికారం కూడా లేదని న్యాయమూర్తులు మండి పడ్డారు. ఆధారాలు లేనప్పడు ఏ ప్రాతిపదికన సీల్ వేశారో..? అన్న ప్రశ్నలతో ఈడీ తరపు న్యాయవాదులను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ కేసులో ఆకాశ్, విక్రమ్లకు సంబంధాలు ఉన్నట్టుగా ఈడీ ఆధారాలు సమర్పించక పోవడాన్ని పరిగణించి, తదుపరి చర్యలకు చెక్ పెడుతూ స్టే విధించారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.