
100 స్థానాలపై ప్రత్యేక దృష్టి
● సోదరా...కదిలిరాతో బలోపేతం
సాక్షి, చైన్నె : ఉడన్పెరుప్పే వా..( సోదరా..కదిలిరా) నినాదంతో 100 అసెంబ్లీ స్థానాలపై సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మలి విడతగా మంగళవారం నుంచి 20వ తేదీ వరకు 12 నియోజకవర్గాల నేతలతో సమావేశాల్లో స్టాలిన్ బీజీ అయ్యారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహాలకు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదును పెట్టారు. పార్టీ పరంగా సీనియర్లు, ఎంపీలు, మాజీ మంత్రులతో డివిజన్లను ఏర్పాటు చేసి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ వస్తున్నారు. తాను సైతం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కై వశం చేసుకున్న స్థానాలు, ఇతర పార్టీల గుప్పెట్లోకి వెళ్లిన నియోజకవర్గాలు, తక్కువ ఓట్లతో డీఎంకే కూటమి అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలపై స్టాలిన్ ప్రత్యేక దృష్టి సారించడం మంగళవారం వెలుగు చూసింది. నియోజకవర్గాల్లోని పరిస్థితులను అక్కడి పార్టీకి విధేయులుగా ఉన్న నేతల ద్వారా తెలుసుకునేందుకు గత వారం సోదరా కదిలిరా నినాదంతో సమావేశాలపై స్టాలిన్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
మలి విడతగా..
సోదరా..కదిలిరా భేటీ ద్వారా 100 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా ఈ సమాలోచనలు జరుగుతుండటం గమనార్హం. తొలి విడతగా విల్లుపురం, చిదంబరం, ఉసిలంపట్టి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలను పిలిపించి మాట్లాడారు. మలి విడతగా మంగళవారం గౌండం పాళయం, పరమిత్తివేలూరు, పరమకుడి నియోజకవర్గాల నేతలతో సుదీర్గంగా సమావేశమయ్యారు. అక్కడి పరిస్థితులను నేతల వద్ద స్వయంగా తెలుసుకున్నారు. ఒకొక్కర్ని పిలిచి స్టాలిన్ మాట్లాడటం గమనార్హం. 2021 ఎన్నికలు, లోక్సభ ఓటింగ్ శాతం మేరకు 100 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నట్టు తాజాగా పరిగణించి ఉన్నారు. 75 నియోజకవర్గాలు ప్రతి పక్షాల వద్ద ఉండగా, మరో 25 స్థానాల్లో మెజారిటీ అన్నది స్వల్ప తేడాతో ఉండడంతో ఈ స్థానాలను బలోపేతం దిశగా, ఇక్కడ కార్యాక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు సోదరా కదిలారా పేరుతో వన్ టు వన్ నినాదం మేరకు నేతలతో స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.