
కొత్త పార్టీ స్థాపనకు పన్నీరు కుస్తీ !
జూలై 7న నిర్ణయం
సాక్షి, చైన్నె: అన్ని దారులు మూసుకోవడంతో ఇక కొత్త పార్టీ ద్వారా రాజకీయ ఉనికి చాటుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం వెలువడింది. జూలై 7న తన మద్దతు దారులతో సమావేశం మేరకు పార్టీ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. అన్నాడీఎంకేలో పళణి స్వామితో వైర్యం మాజీ సీఎం పన్నీరు సెల్వంను ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడులో తన సామాజిక వర్గం బలాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ వ్యూహాలకు పన్నీరు సెల్వం పదును పెట్టినా కాల క్రమేణా ఒక వేదిక అన్నది లేకుండా సంకట పరిస్థితులను ఎదుర్కొక తప్పలేదు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా, చివరకు అవన్నీ కోర్టు తీర్పులతో బెడిసి కొటినట్టైంది. అన్నాడీఎంకేను ప్రధాన కార్యదర్శిగా పళణిస్వామి పూర్తిగా తనగుప్పెట్లోకి తెచ్చుకున్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్కు తప్ప, మిగిలిన వారికి అన్నాడీఎంకేలో ప్రవేశం షురూ అని పళణి స్వామి ప్రకటించారు. దీంతో పన్నీరు వెన్నంటి ఉన్న నేతలు సైతం తాజాగా గోడ దూకేస్తూ, మాతృగూటికి చేరే వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. అమ్మక్కల్ మున్నేట్రకళం దినకరన్ వెన్నంటి ఉన్న వాళ్లకు ఒక వేదిక అన్నది ఉన్నప్పటికీ, పన్నీరు సెల్వంకు ఎలాంటి వేదిక లేక పోవడంతో అనేక మంది మద్దతు దారులు ఆలోచనలో పడ్డట్టు ప్రచారం ఊపందుకుంది.
పార్టీ తప్పని సరి
బీజేపీ అక్కున చేర్చుకుంటుందని భావించిన పన్నీరు తప్పులో కాలేశారు. అన్నాడీఎంకే, బీజేపీ ఒక గూటికి చేరడంతోపాటు దక్షిణ తమిళనాడులో కీలకంగా ఉన్న నైనార్ నాగేంద్రన్ బీజేపీ సారథి పగ్గాలు చేపట్టడంతో పన్నీరు కాస్త వెనుకంజలో పడ్డారు. దక్షిణ తమిళనాడులోని పన్నీరు సెల్వం సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు కేంద్రంలో బీజేపీ పాలన ఉన్న దృష్ట్యా, నైనార్ వైపు దృష్టి పెడుతున్నట్టు సమాచారాలు విస్తృతమయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తనను దూరంగా పెట్టిన నేపథ్యంలో ఇక, కొత్త పార్టీ ద్వారానే రాజకీయ వ్యూహం అన్నట్టుగా పన్నీరు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. దీంతో కొత్త పార్టీ కసరత్తుపై దృష్టి పెట్టేలా ముఖ్య నేతలకు పన్నీరు సూచనలు ఇచ్చినట్టు, జూలై 7వ తేదిన జరిగిన మద్దతు దారుల సమావేశంలో తుది నిర్ణయాన్ని పన్నీరు ప్రకటించబోతున్నట్టుగా తాజాగా సమాచారం వెలువడడం గమనార్హం.