
ఇంటి వద్దకే రేషన్కు కసరత్తు
సాక్షి, చైన్నె: ఇంటి వద్దకే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రేషన్ వస్తువులను సరఫరా చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేపట్టింది. సుమారు 15 లక్షల కార్డులో ఉన్నట్టు గుర్తించి, వీరికి మొబైల్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 2.21 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డు దారులకు బియ్యం, గోధుమ ఉచితంగా, చక్కెర, పప్పు, పామోలిన్ చౌక ధరకే రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు క్యూలో నిలబడి తీసుకునేందుకు శ్రమిస్తున్నారు. బయోమెట్రిక్ కోసం ఓ సారి, వస్తువుల కోసం మరోసారి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీని విజయవంతం చేయడాన్ని, తాజాగా తమిళనాడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తమిళనాడులో సైతం ఇంటింటికీ వెళ్లి రేషన్ వస్తువుల పంపిణీకి కసరత్తుపై దృష్టి పెట్టారు. సీఎస్ మురుగానందం, సహకార, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించి, ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. తొలి విడతగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కార్డుల ఆధారంగా, వారి ఇళ్లను గుర్తించి ఇంటి వద్దకే రేషన్ వస్తువులను తీసుకెళ్లి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్హెచ్, ఎన్పీహెచ్హెచ్ కార్డుల వివరాలను సేకరించి బయోమెట్రిక్ విధానం ఆధారంగా ఇంటి వద్దకే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ వస్తువులను మరి కొద్ది రోజుల్లో చేర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.