
ఆధారాలేవీ
● ఈడీకి హైకోర్టు ప్రశ్న
సాక్షి, చైన్నె : సినిమా నిర్మాత ఆకాష్ భాస్కరన్, పారిశ్రామిక వేత్త రవీంద్రన్కు టాస్మాక్ వ్యవహారంలో ఉన్న సంబంధాలపై సమగ్ర ఆధారాలెక్కడ? అని ఎన్పోర్సుమెంట్ డైరెక్టరేట్ను మద్రాసు హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. టాస్మాక్లో రూ. వెయ్యి కోట్ల అక్రమాల పేరిట ఈడీ సృష్టించిన సోదాలు, దాడుల గురించి తెలిసిందే. నిర్మాత ఆకాశ్, వ్యాపార వేత్త విక్రమ్ రవీంద్రలు ఈ సోదాలకు వ్యతిరేకంగా, ఈడీ చర్యలకు చెక్ పెట్టేలా మద్రాసు హైకోర్టు ఆశ్రయించారు. తమ కార్యాలయాలను సీజ్ చేయడం, తదితర అంశాలను కోర్టు ముందు ఉంచారు. గత వారం ఈ పిటిషన్ విచారణకు రాగా, ఈడీని ప్రశ్నలతో న్యాయమూర్తుల బెంచ్ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ ప్రాతిపదికన, ఎలాంటి సమాచారాల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆధారాలు సమర్పించాలని న్యాయమూర్తుల బెంచ్ ఆదేశించింది. తాజాగా విచారణ సమయంలో సీల్డ్ కవర్లో ఆధారాలను సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. టాస్మాక్ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధం ఏమిటీ? అని ప్రశ్నిస్తూ, అందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ..? అని ఈడీని ప్రశ్నించారు. టాస్మాక్లో అక్రమాలు జరిగినట్టుగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో, సోదాలు జరిగిన పరిస్థితుల్లో, ఈ కేసుతో వీరికి ఉన్న సంబంధం ఏమిటో రుజువు చేసే ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత లేదా? అని పేర్కొంటూ ఈడీకి అక్షింతలు వేశారు. బుధవారం సమగ్ర ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.