
ముగిసిన విజయ్ విద్యా ప్రోత్సాహం
– విద్యార్థినికి రూ.2లక్షల కానుక
సాక్షి, చైన్నె: పది, ప్లస్టూ విద్యార్థులకు విజయ్ ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. నాలుగో విడతగా 242 మంది విద్యార్థులను విజయ్ సత్కరించారు. తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో గత సంవత్సరం నుంచి పది ,ప్లస్టూలో టాపర్లను సత్కరించే విధంగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టాపర్లను ఎంపికచేసి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించే విధంగా నాలుగు విడతల కార్యక్రమానికి చర్యలు తీసుకున్నారు. గత నెల చివరి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. చివరి విడతగా ఆదివారం 242 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విజయ్ సత్కరించారు. వారికి ప్రోత్సాహాకాలను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పలువురు మాట్లాడుతూ విజయ్ను హేళన చేస్తున్న వారికి తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తామంతా పది, ప్లస్టూ పిల్లలు అని, విజయ్ తమకు తండ్రి లాంటి వారని కొందరు, మామ లాంటి వారని మరి కొందరు, అన్న లాంటి వారు అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తూ, ఆయనతో ప్రేమగా మెలగడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతిఒక్కరి ఇంట్లో అన్న, మామ, తండ్రితో పిల్లలు ఏ విధంగా మెలుగుతారో అదేవిధంగా తాము ఇక్కడ విజయ్తో తమ ఆప్యాయతను చాటుకున్నామని వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో తన ఇంట్లో విద్యుత్ వెలుగు లేనప్పటికీ, కొవ్వొత్తి వెలుగులో చదువుకున్న రాజేశ్వరి అనే విద్యార్థికి విజయ్ ఊహించని రీతిలో రూ.2 లక్షలను అందజేసి ఆమెను షాక్కు గురి చేశారు. ఆ ఇంటికి విద్యుత్ వెలుగులు నింపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ రాజకీయ ప్రసంగాలకు ఆస్కారం ఇవ్వకుండా తాజా విడతను విజయవంతం చేశారు. పార్టీ నేతలు భుస్సీఆనంద్, ఆదవ్ అర్జున్ పాల్గొన్నారు.
పొటో:14: ప్రసంగిస్తున్న విద్యార్థిని
ప్రసంగిస్తున్న విద్యార్థిని