
పన్నీరుకు పదవీ గండం
– స్పీకర్కు ఫిర్యాదు
సాక్షి,చైన్నె : మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టేలా అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయనకు వ్యతిరేకంగా స్పీకర్ అప్పావుకు ఆదివారం అన్నాడీఎంకే తరఫు పిర్యాదు చేరింది. అన్నాడీఎంకేను తన వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన విశ్వ ప్రయత్నాల గురించి తెలిసిందే. న్యాయ పోరాటంలో ఆయనకు పతనం తప్పలేదు. అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన దూకుడు పెంచారు. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం చేతిలో ఉన్న శాసన సభా పక్ష ఉపనేత పదవిని లాగేసుకున్నారు. అన్నాడీఎంకే నుంచి ఆయన్ను బహిష్కరించారు. అన్నాడీఎంకే ఏదో ఒక రోజు తన వశం అవుతుందన్న ఆశతో పన్నీరు రాజకీయ పయనం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం ఎసరు పెట్టేలా అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆయన విప్ను ధిక్కరించారన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఆయన్న పార్టీ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించే దిశగా వ్యూహానికి పళణి స్వామి పదును పెట్టారు. ఇందులో భాగంగా స్పీకర్ అప్పావుకు ఆదివారం ఫిర్యాదు చేరింది. చట్ట నిపుణులతో చర్చించి పన్నీరు సెల్వంపై చర్యలకు అసెంబ్లీ కార్యాలయం వర్గాలు చర్యలు చేపట్టాయి.