
నా గుప్పెట్లోనే పీఎంకే
సాక్షి, చైన్నె : పీఎంకే తన గుప్పెట్లోనే ఉందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని పేర్కొన్నారు. పీఎంకేలో సాగుతున్న పరిణామాల్లో రోజుకో ట్విస్టుతో ధారవాహికగా సాగుతోంది. రాందాసు ఒక అడుగు వేసే, దాన్ని దలదన్నేలా ఆయన తనయుడు అన్బుమణి వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తననే అధ్యక్షుడిగా ధ్రువీకరించిందని, ఈ దృష్ట్యా, పీఎంకే తనదే అంటూ అన్బుమణి స్పందించడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో సోమవారం తైలాపురంలో రాందాసు పార్టీ నిర్వాహకులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్య నేతలు, కొత్తగా నియమితులైన జిల్లాల అధ్యక్షులు, ఇతర నిర్వాహకులతో ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా రాందాసు ఓ మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పీఎంకే బలంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయంలో నేతల నుంచి నేటితరం వరకు 95 శాతం మంది తన వెన్నంటే ఉన్నారని చెప్పారు. 2026 ఎన్నికల వరకు తాను అధ్యక్షుడిగా ఉండాలని భావించానని, ఈ ప్రకటన వెలువడిన కాసేపటికి అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలతో తాను మనస్సు మార్చుకుని, ఊపిరి ఉన్నంత వరకు తానే అధ్యక్షుడ్ని అని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. అన్బుమణిని అభిమానించాను, నమ్మాను, అయితే తాజాగా తన చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాడని మండిపడ్డాడు. కుటుంబంలోని మహిళలు పార్టీలో పదవులు స్వీకరించ కూడదని స్పష్టంగా చెప్పి ఉన్నానని, అయితే, అందుకు విరుద్ధంగా ప్రయత్నాలు జరగడంతోనే ఊపిరి ఉన్నంత కాలం తానే పార్టీ అధ్యక్షుడిని అని, తన వెన్నంటే అందరూ ఉన్నారని, పీఎంకే తన గుప్పెట్లోనే ఉందని, ఇందులో అనుమానాలు వద్దని స్పష్టం చేశారు.