
విస్తృతంగా పథకాల అమలు
● అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
సాక్షి, చైన్నె: ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, ప్రణాళికల అమలు విస్తృతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆదేశించారు. తేని జిల్లా పర్యటనలో భాగంగా ఆ జిల్లా అధికారులతో సోమవారం ఉదయనిధి స్టాలిన్ సమీక్షించారు. మహిళా హక్కు పథకం, నాన్ మొదల్వన్, పుదుమైపెన్, తమిళ పుదల్వన్, అల్పాహారం, కలైంజ్ఞర్ పట్టణాభివృద్ధి పథకాలు, గృహ నిర్మాణాలు, ఆర్యోగబీమా పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేశారు. ప్రజలకు పథకాల నుంచి మంచి ఆదరణ వస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఎవరెవరు అర్హులు ఉన్నారో వారందరికి పథకాలను త్వరితగతిన దరిచేర్చాలని ఆదేశించారు. ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉందని, అప్పటిలోపు అన్ని పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలని సూచించారు. ఓటు వేసిన వాళ్లు, ఓటు వేయని వాళ్లు అన్న భేదాలు చూడ వద్దని అందరికి అన్నీ దక్కే విధంగా పథకాలు, ప్రాజెక్టులు, ప్రణాళికలను సీఎం స్టాలిన్ అమలుచేస్తున్నారని ఇవన్నీ అర్హులకు చేరాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా విద్యా పథకాలపై తరచూ అధ్యయనం చేయాలని, క్రీడాపరంగా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై నిర్లక్ష్యం వద్దని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రతి ఒక్క అధికారి పనితీరు ఉండాలని హెచ్చరించారు. 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నామన్న విషయాన్ని మరోమారు ప్రస్తావిస్తూ, ప్రజల ప్రాథమిక అవసరాలైన రోడ్డు సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి పనుల్లో ఆలస్యం ఉండకూడదని సూచించారు. మంత్రి పెరియస్వామి, ఎంపీ తంగతమిళ్ సెల్వన్, ఎమ్మెల్యేలు ఎన్.రామకృష్ణన్, ఎ. మహారాజన్, కె.ఎస్. శరవణకుమార్, ప్రత్యేక పథకాల అమలు విభాగం అదనపు డైరెక్టర్ ప్రదీప్యాదవ్, అదనపు కార్యదర్శి ఆర్వీ. జీవన, కలెక్టర్ రంజిత్సింగ్ పాల్గొన్నారు.