
అన్నదాతకు కురువై ప్యాకేజీ
● డెల్టాకు రూ.82 కోట్లు ● ఇతర జిల్లాలకు రూ.132 కోట్లు ● తంజావూరులో రూ.1,194 కోట్ల ప్రగతి పనులు ●ప్రారంభించిన సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: కురువై సీజన్లో వరిసాగు నిమిత్తం అన్నదాతకు ప్రత్యేక ప్యాకేజీని తంజావూరు వేదికగా సీఎం స్టాలిన్ సోమవారం ప్రకటించారు. డెల్టా జిల్లాల్లోని రైతులకు రూ.82 కోట్లు, ఇతర జిల్లాల్లోని రైతులకు రూ.132 కోట్లను ఈ ప్యాకేజీ మేరకు ప్రకటించారు. అలాగే, తంజావూరు జిల్లాలో రూ.1,194 కోట్లతో పూర్తిచేసిన చేపట్టనున్న ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.
తంజావూరులో క్షేత్రస్థాయి పర్యటనలో రెండవ రోజు సీఎం స్టాలిన్ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం నిమిత్తం తంజావూరు పాత బస్టాండ్ సమీపంలో కలైంజ్ఞర్కు ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎంకు దారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. విగ్రహాన్ని ఆవిష్కరించినానంతరం మారు మూల ప్రాంతాలకు మినీ బస్సుల సేవలకు శ్రీకారం చుట్టారు. తంజావూరు, సర్బోజి ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కొత్త మినీ బస్సులకు జెండా ఊపారు. 3,103 మార్గాలలో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. రూ.325 కోట్ల 96 లక్షల 92 వేలతో జిల్లాలో పూర్తి చేసిన 2,461 పనులను ప్రారంభించారు. రూ.309 కోట్ల 48 లక్షల 20 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న 4,127 కొత్తపనులకు శంకుస్థాపన చేశారు. రూ.558 కోట్ల 43 లక్షల విలువైన సంక్షేమ పథకాలను 2,25,383 మంది లబ్ధిదారులకు అందించారు. దివ్యాంగులకు పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలు అందజేశారు. మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంఆర్కే పన్నీర్సెల్వం, ఎస్ఎస్.శివశంకర్, కోవి చెజియన్, అన్బిల్ మహేష్, శివ వి.మెయ్యనాథన్, ఢిల్లీలోని తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎస్.విజయన్, ఎంపీలు తిరుచ్చి శివ, కల్యాణసుందరం, ఎస్.మురసోలి, ఆర్.సుధ పాల్గొన్నారు. అనంతరం తంజావూరులో జరిగిన శాసనసభ సభ్యుడు, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శి దురైచంద్రశేఖరన్ ఇంటి శుభకార్య వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈసందర్భంగా తమిళ భాష ఔన్నత్యం గురించి సీఎం వివరిస్తూ, అన్నింటా తమిళం వికసించాలని, ప్రాచీణ భాష తమిళ చరిత్రను గుర్తు చేస్తూ పుట్టే బిడ్డకు తమిళంలోనే పేర్లు పెట్టాలని కోరారు. అనంతరం తంజావూరులోనీ సీఎం మెడికల్ దుకాణంలో ఆకస్మికం తనిఖీలు చేసి, అక్కడ ధరలు, మందుల వివరాలను తెలుసుకున్నారు.
కొత్త వాగ్దానాలు
తంజావూరులోని సరస్వతి మహల్ను మరింతగా అభివృద్ధి చేయనున్నామని , ప్రస్తుతం కేటాయించిన నిధులను పెంచుతున్నామన్నారు. వెన్నార్ – వెట్టార్ నదీ తీరంలోని దక్షిణ పెరంబూరులో రూ. 42 కోట్లతో వంతెన నిర్మించనున్నామన్నారు. బూతలూరు సర్కిల్లోని హై కొండన్ ఎక్స్టెన్షన్ కెనాల్ను రూ. 15 కోట్లతో పునరుద్దరించేందుకు నిర్ణయించామని వివరించారు. ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి ఆయన పార్టీ అంతర్గత వివాదాలను, పొత్తుల రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు తన ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారని విమర్శించారు. ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత గల పదవిలో తాను ఉన్నానని, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ అహర్నిషలు తన పయనం ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా గవర్నర్ ధోరణిలో మార్పు రాకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. కలైంజర్ విశ్వవిద్యాలయ బిల్లు గురించి ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంగా ఆయన్ను మంత్రి కలిసేందుకు ప్రయత్నించినా అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. తమిళనాడు ప్రజలందరూ అడుగుతున్న ఒక ప్రశ్న ఉంటే, 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడు ఇలాంటి అడ్డంకులు చూడలేదని, సంక్షోభాన్ని సృష్టించమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ అహంకారాన్ని తిప్పి కొట్టి, అనుకున్నది సాధించాలనే ధైర్యం, దృఢ సంకల్పం తనకు ఉందని, ప్రజలు ఎల్లప్పుడు తనకు అండగా, మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ప్రజలతో మరింత మమేకమయ్యే విధంగా మీతో స్టాలిన్ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని సీఎం ప్రకటించారు. పది వేల శిబిరాలను ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈకార్యక్రమం జూలై 15వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఇందులో మహిళా హక్కు పథకం కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవచ్చని, వారి వారి సమస్యలు నేరుగా తన దృష్టికి ఈ శిబిరాల ద్వారా తీసుకు రావచ్చని వివరించారు. తంజావూరు పర్యటనకు వచ్చిన స్టాలిన్కు కొన్ని రైతు సంఘాలు ప్రైవేటు చక్కెర కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసనకు దిగి, స్టాలిన్కు నల్ల జెండాలను ప్రదర్శించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
న్యూస్రీల్
కురువై ప్యాకేజీ
ముందుగా ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ప్రసగిస్తూ మేట్టూరు నుంచి కావేరి డెల్టా జిల్లాలకు సాగు నీరు విడుదలు, కళ్లనై రిజార్వయర్ నుంచి నాలుగు జిల్లాలకు నీటి విడుదల విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సంవత్సరం ప్యాకేజీని మరింతగా పెంచుతున్నామని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ద్వారా తంజావూరు జిల్లాలో 56 వేల మంది, తమిళనాడులోని ఇతర 36 జిల్లాల్లో 8 లక్షల మందిని రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్టు వివరించారు.
మీతో స్టాలిన్..

అన్నదాతకు కురువై ప్యాకేజీ

అన్నదాతకు కురువై ప్యాకేజీ

అన్నదాతకు కురువై ప్యాకేజీ