రిజర్వేషన్లపై శాసనసభలో రచ్చరచ్చ! సీఎం హామీతో శాంతించిన వైనం | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై శాసనసభలో రచ్చరచ్చ! సీఎం హామీతో శాంతించిన వైనం

Apr 14 2023 1:52 AM | Updated on Apr 14 2023 11:52 AM

నోటికి నల్ల మాస్కులు ధరించి సభ నుంచి వాకౌట్‌ చేస్తున్న అన్నాడీఎంకే నేతలు  - Sakshi

నోటికి నల్ల మాస్కులు ధరించి సభ నుంచి వాకౌట్‌ చేస్తున్న అన్నాడీఎంకే నేతలు

సాక్షి, చైన్నె: వన్నియర్లకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకంగా 10.5 శాతం స్థానిక కోటా రిజర్వేషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆగమేఘాలపై చట్టం తీసుకురావడం, గవర్నర్‌ ఆమోదించడం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు 10.5 శాతం రిజర్వేషన్‌ను ప్రశ్నార్థకం చేశాయి. తొలుత మధురై ధర్మాసనం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. నిబంధనలను పాటించకుండా ఆగమేఘాలపై తెచ్చిన ఈ రిజర్వేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ వేదికగా ఈ రిజర్వేషన్‌ అమలు విషయంపై చర్చకు పీఎంకే పట్టుబట్టింది.

నువ్వా..నేనా..?
పీఎంకే శాసన సభా పక్ష నేత జీకే మణి సభలో రిజర్వేషన్ల అంశంపై ప్రసంగించారు. ఆయన చేసిన ఓ వ్యాఖ్యపై స్పీకర్‌ అప్పావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వివాదాలకు వేదిక ఇది కాదని ఆయన మందలించారు. అయినా, జీకే మణి తగ్గక పోవడంతో సభలో వివాదం చోటు చేసుకుంది. సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ స్పందిస్తూ, వన్నియర్ల సామాజిక వర్గం డీఎంకేలోనే అధికంగా ఉన్నారని పేర్కొంటూ, చిత్తశుద్ధితోనే తాము పనిచేస్తున్నామని విరుచుకు పడ్డారు.

అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ల వ్యవహారంలో నియమించిన కమిషన్‌కు ఆరు నెలలు గడువు ఎందుకు పెంచారని జీకే మణి ప్రశ్నించారు. అదే సమయంలో తమిళర్‌ వాల్వురిమై కట్చి ఎమ్మెల్యే వేల్‌ మురుగన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సభా రికార్డుల నుంచి తొలగించాలనే నినాదాలు మిన్నంటాయి. అన్నాడీఎంకే సభ్యుడు కేపీ మునుస్వామి మాట్లాడుతూ, తమ హయాంలోనే ఈ రిజర్వేషన్‌ తీసుకొచ్చామని, విద్యా, ఉద్యోగ అవకాశాలలో ఆ సామాజిక వర్గం యువతకు సమన్యాయం చేయాలని పట్టుబట్టారు.

చివరగా సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ, తాము అధికారంలోకి వచ్చినానంతరం కూడా ఈ రిజర్వేషన్‌ను అమలు చేశామని, అయితే కోర్టు రూపంలో దీనికి బ్రేక్‌ పడిందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం తాము కోర్టులో బలమైన వాదనలు వినిపించామన్నారు. అయితే అత్యవసరంగా, ఆగమేఘాలపై , ఏ సమయంలో.. ఎందుకు ఈ చట్టం తీసుకు రావాల్సి వచ్చిందో అనే విషయం పీఎంకే వర్గాలకే బాగా తెలుసునని, అందుకే కోర్టు చెక్‌ పెట్టిందని పేర్కొన్నారు. కమిషన్‌ విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించామని, అంతలోపు కమిషన్‌ నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నామన్నారు. చివరకు సీఎం హామీతో సభలో వివాదం ముగిసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, కొంగు నాడు మక్కల్‌ దేశీయ కట్చి ఎమ్మెల్యే ఈశ్వరన్‌, వీసీకే బాలాజీ ప్రసంగించారు.

బీజేపీ వాకౌట్‌..
సభలో ఐపీఎల్‌ వ్యవహారం బుధవారం చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఈసమయంలో క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ ప్రసంగిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆయన తనయుడి గురించి వ్యాఖ్యలు చేసినట్టు సామాజిక మాధ్యమాలలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇది గురువారం సభలో ప్రస్తావనకు వచ్చింది. అమిత్‌ షా పేరును ఉచ్చరించాల్సిన అవసరం ఉదయ నిధికి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని, ఆయన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు సీఎం స్టాలిన్‌ ఇచ్చిన సమాధానంతో ఏకీభవించని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు సభలో అటవీ, పర్యావరణ, వెనుకబడిన తరగతుల శాఖలకు నిధు ల కేటాయింపులు చర్చ సుదీర్ఘ చర్చ సాగింది.

నల్ల మాస్కులతో సభకు...
సభకు అన్నాడీఎంకే సభ్యులు అందరూ నల్ల మాస్క్‌లు ధరించి వచ్చారు. ప్రసంగించే సమయంలో మాస్క్‌లు తొలగించగా, ఆ తర్వాత మాస్క్‌లు వేసుకుని కనిపించారు. ఈ విషయంగా సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ స్పందిస్తూ, సభకు ఎలా రావాలో అనే నిబంధనలు తెలిసిన ప్రధాన ప్రతిపక్షం, ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చారని..? ప్రశ్నించారు. తొలుత అన్నాడీఎంకే సభ్యులు స్పందించనప్పటికీ చివరకు, ఆ పార్టీ విప్‌ ఎస్పీ వేలుమణి పేర్కొంటూ, తమ గళాన్ని నొక్కేస్తున్నారని, తమ ప్రసంగాలు, విజ్ఞప్తులు, డిమాండ్లు బయటకు తెలియజేయకుండా అడ్డుకుంటున్నారని, అందుకే ఇలా నిరసన వ్యక్తం చేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement