
ఈ ఏడాది.. రాగిజావ ఏదీ?
హుజూర్నగర్ : పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ ఇంకా ప్రారంభించలేదు. గత ఏడాది పీఎం పోషణ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీని ప్రారంభించి విద్యా సంవత్సరం చివరి వరకు అందించారు. కానీ, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు విద్యార్థులకు రాగిజావ పంపిణీని ప్రారంభించలేదు. దీంతో విద్యార్థులు ఒకింత నిరుత్సాహానికి గురువుతున్నారు.
జిల్లాలో 45వేల మందికిపైగా చిన్నారులు
జిల్లాలో మొత్తం 979 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 690 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18,062 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 78 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,079 మంది, 211 ఉన్నత పాఠశాలల్లో 24,777తో కలిపి మొత్తం 45,918 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరూ గతేడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం రాగిజావ అందిస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.
వారంలో మూడు సార్లు..
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు కోడి గుడ్డు ఇస్తున్నారు. గుడ్డు లేని రోజుల్లో అంటే మంగళ, గురు, శనివారాల్లో మూడు రోజులపాటు మధ్యాహ్న భోజనానికి ముందు గత సంవత్సరం విద్యార్థులకు బెల్లంతో చేసిన రాగిజావ పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి పది గ్రాముల రాగి పిండి, బెల్లంతో మరిగించిన జావను ఇచ్చారు. ఇది మంచి పోషకాలతో కూడి ఉండడంతో చాలా మంది విద్యార్థులు ఇష్టంగా తాగారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు రాగిజావ అందిస్తే బాగుంటుందని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలలు పునః ప్రారంభమై
నెలన్నర రోజులు
నేటికీ రాగిజావ పంపిణీని
ప్రారంభించని ప్రభుత్వం
ఎదురుచూపుల్లో విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 979 స్కూళ్లు.. 45,918 మంది విద్యార్థులు
మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేస్తాం
ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది ఇంకా రాగిజావ పంపిణీకి సంబంధించిన ఆదేశాలు రాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విద్యార్థులకు జాగిరావ పంపిణీ చేస్తాం.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి

ఈ ఏడాది.. రాగిజావ ఏదీ?