
ఉపాధ్యాయులకు పదోన్నతులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. జూలై మాసం పూర్తి కావొస్తున్నందున ముందుగా పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. పదోన్నతులకు సంబంధించి మరో రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
950 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 688 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 184 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 3790 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 1694 మంది ఎస్జీటీలు, 1750 మంది స్కూల్ అసిస్టెంట్లు, 157 గెజిటెడ్ హెచ్ఎంలు, మిగిలిన ఉపాధ్యాయులు ఇతర కేటగిరీలకు చెందిన వారు ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన పదోన్నతులు, బదిలీల్లో సుమారు 641 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. 912 మంది ఎస్జీటీల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎంలుగా 68 మందికి ప్రమోషన్, 672 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు.
ఖాళీల ఆధారంగా..
జిల్లా పరిధిలో ఎస్జీటీలకు, మల్టీజోన్న్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. మొత్తంగా వివిధ కేటగిరిల్లో 198 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంల ఖాళీలు 23, మిగతావి స్కూల్ అసిస్టెంట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితా సైతం రూపొందిస్తున్నారు. జూన్న్30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 198 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి.
ఇప్పటికే 91 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఉత్తీర్ణతతోపాటు చదువులో వెనుకబడిపోతున్నారు. దీంతో టీచర్ల కొరత అధిగమించేందుకు ఇటీవల జిల్లాలో 91 మంది ఉపాధ్యాయులను అధికారులు వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారు. జీఓ నంబర్ 25 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిర్వహించారు. మండల స్థాయిలో ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల్లో ఖాళీల వివరాలు సేకరించారు.
రెండు రోజుల్లో షెడ్యూల్ !
ప్రభుత్వం మొదట బదిలీలు చేపట్టి పదోన్నతులు చేస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. రెండు రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల కానుండడంతో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సీనియారిటీతో పాటు ఖాళీలను గుర్తిస్తున్నారు. షెడ్యూల్ వెలువడితే 15 నుంచి 20 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. బదిలీలు ఇప్పుడు చేపడితే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఫ వివరాలు సేకరిస్తున్న
విద్యాశాఖ అధికారులు
ఫ జిల్లాలో 198 మంది
ప్రమోషన్ పొందే అవకాశం
సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేస్తున్నాం
ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో సీనియారిటీ జాబితాతోపాటు వివిధ కేటగిరిల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది పరిశీలిస్తున్నాం. సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నాం. షెడ్యూల్ రాగానే పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుంది.
–అశోక్, డీఈఓ

ఉపాధ్యాయులకు పదోన్నతులు