
ఎట్టకేలకు సర్దుబాటు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉత్తీర్ణతతో పాటు చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలో టీచర్ల కొరతను తీర్చేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. అవసరమైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించింది. కొంతకాలంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు చేసి కలెక్టర్ సంతకం పెట్టడం ద్వారా ఎట్టకేలకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో జిల్లాలో 91 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. నేడో రేపో వారికి ఉత్తర్వులు అందనున్నాయి. మరో 40 మంది టీచర్లను రెండో విడతలో సర్దుబాటు చేయనున్నారు.
అవసరమైన చోట..
జిల్లాలో 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు తగ్గుతున్నాయి. దీంతో మండల స్థాయిలో ఎంఈఓల పర్యవేక్షణలో ఖాళీల వివరాలు సేకరించారు. జీఓ నంబర్ 25 ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
పాఠశాలకు వెళ్లేనా..?
ఉపాధ్యాయులను కొందరిని ఒకటే మండలం నుంచి ఇతర పాఠశాలకు పంపగా మరికొందరిని ఇతర మండలాలకు సైతం సర్దుబాటు చేశారు. అయితే వారికి అనుకూలంగా లేని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్తారా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అదే పాఠశాలలో ఉండేందుకు పైరవీలు సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా కలెక్టర్ ఆదేశాల మేరకు కచ్చితంగా సర్దుబాటు చేసిన పాఠశాలకు వెళ్లాల్సిందేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
హై స్కూళ్లకు ఎస్జీటీల సర్దుబాటును
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
డీఎస్సీ 2024లో ఎస్జీటీలు ఎక్కువగానే జిల్లాలో రిక్రూట్ అయ్యారు. ఎక్కువగా హై స్కూళ్లలోనే సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఎస్జీటీలను ప్రైమరీ స్కూల్కు సర్దుబాటు చేస్తే విద్యార్థులకు నష్టం కలుగకుండా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్జీటీలను హైస్కూల్కు సర్దుబాటు చేయడం ద్వారా వారికి హై స్కూల్ బోధనపై పట్టు ఉండదని, అలా చేయడం ద్వారా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయుల సర్దుబాటు శాసీ్త్రయంగా చేయాలని కోరుతున్నారు. ఎస్జీటీలను హైస్కూళ్లకు సర్దుబాటు చేయడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
మండలాల వారీగా సర్దుబాటు
మండలం టీచర్ల సంఖ్య
అనంతగిరి 03
ఆత్మకూర్.ఎస్ 06
చిలుకూరు 03
చింతలపాలెం 02
చివ్వెంల 04
గరిడేపల్లి 07
హుజూర్నగర్ 04
జాజిరెడ్డిగూడెం 04
కోదాడ 08
మద్దిరాల 04
మఠంపల్లి 06
మేళ్లచెరువు 01
మోతె 02
నడిగూడెం 05
నాగారం 01
నేరేడుచర్ల 01
నూతనకల్ 01
పాలకవీడు 02
పెన్పహాడ్ 03
సూర్యాపేట 12
తిరుమలగిరి 03
తుంగతుర్తి 09
ఫ మొదటి విడతలో 91 మంది టీచర్లను సర్దుబాటు చేసిన విద్యాశాఖ
ఫ జీఓ నంబర్ 25 ప్రకారం ప్రక్రియ
ఫ నేడో.. రేపో ఉపాధ్యాయులకు
అందనున్న ఉత్తర్వులు
ఫ ఎస్జీటీలను హైస్కూళ్లకు
కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న
ఉపాధ్యాయ సంఘాలు
నిబంధనల మేరకు సర్దుబాటు
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేశాం. ఇప్పటి వరకు 91 మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు పంపించాం. సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు ఉత్తర్వులు రాగానే వెంటనే వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలి.
– అశోక్, డీఈఓ
నిబంధనల మేరకు ఇలా..
విద్యార్థుల సంఖ్య సర్దుబాటు చేసిన
టీచర్ల సంఖ్య
11 ఒక్కరు
11–30 ఇద్దరు
30–90 ముగ్గురు
90–130 నలుగురు

ఎట్టకేలకు సర్దుబాటు