● 15 మంది గైర్హాజరు
97.85%
మంది హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ–2026 (మోడ్రన్ మెడిసిన్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పకడ్బందీగా పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 697 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 682 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీంతో జిల్లాలో మొత్తం 97.85 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు ధ్రువీకరించారు.
పరీక్షా కేంద్రాల వారీగా చూస్తే..
పరీక్ష కేంద్రాలవారీగా విద్యార్థుల హాజరును చూస్తే.. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్లో 270 మందికిగాను 266 మంది, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 100 మందికి 97 మంది, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్లో 312 మందికిగాను 305 మంది, అలాగే టెక్కలి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐతమ్)లో 15 మందికిగాను 14 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, ఇతర అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని నాలుగు కేంద్రాలైన చిలకపాలెం శివాని, శ్రీ వెంకటేశ్వర, నరసన్నపేట కోర్ టెక్నాలజీస్, టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష పోలీసుల పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించామని, కేంద్రాలను డ్రోన్ సర్వేలైన్స్ వినియోగించి పర్యవేక్షించామన్నారు. బందోబస్తును శ్రీకాకుళం, టెక్కలి డీఎస్పీలు సిహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు సమక్షంలో సీఐలు ఎం.అవతారం, ఎం.శ్రీనివాసరావు, విజయ్లు తమ సిబ్బందితో కలసి నిర్వహించారు.


