టెక్కలి రూరల్: ఖరీఫ్ సీజన్ కావడంతో పొలాల్లో వ్యవసాయ పనులు పెరగడంతో రైతులు పాముల సంచారం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పొలాల్లో కలుపు మొక్కలు తొలగించే సమయాల్లోను, పంటకు నీరు పెట్టే సమయాల్లో రైతులు పాముకాటుకు గురవుతున్నారు. గత నెల రోజులు వ్యవధిలో టెక్కలి జిల్లా ఆస్పత్రి పరిధిలో 110 పైగా పాముకాట్లకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులు కిందట తొలుసూరు పల్లి గ్రామంలో పాము కాటుకు గురై ఓ వృద్ధురాలు సైతం మృతి చెందింది. ప్రతి రోజు మూడుకు పైగా పా ముకాటు కేసులు ఆస్పత్రి చేరుతున్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలంలో పనులు చేసే సమయంలో ఏదైనా కరిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. చాలా మంది పాములను పట్టుకోవాలనే ప్రయత్నంలో సైతం పాముకాటులకు గురవుతున్నారని కావున విషపూరిత జీవులపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


