● జిల్లాలో అడుగడుగునా వైఎస్సార్ జ్ఞాపకాలు
● చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు
ఆయన దశాబ్దాల తరబడి పాలించలేదు. ఏళ్లకు ఏళ్లు అధికార పీఠంపై కూర్చోలేదు. ఆరంటే ఆరేళ్లు.. మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఆరేళ్ల కాలంలోనే జిల్లా తలరాతను మార్చే అపురూప ప్రాజెక్టులను కానుకలుగా ఇచ్చారు. పేదలకు గూడునిచ్చి జనబాంధవుడయ్యారు. నిరుపేద రోగుల ప్రాణాలు నిలిపారు. అన్నదాతకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండగ చేశారు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పాలన సాగించి సిక్కోలు గుండెలో చిరస్థానం సాధించారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
రిమ్స్ ఆస్పత్రి.. వంశధార ప్రాజెక్టు.. తోటపల్లి జలాశయం.. ఆఫ్షోర్ ప్రాజెక్టు.. అంబేడ్కర్ యూనివర్సిటీ.. ఇవి మావి అని జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే ప్రాజెక్టులు. కేవలం ఆరేళ్ల పాలనా కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు ఇచ్చిన కానుకలు ఇవి. వెనుకబడిన జిల్లా అనే ముద్రను తొలగించడానికి సీఎంగా ఆయన చేసిన ప్రయత్నాలివి. ప్రజల మేలు కోరిన పనిచేసినందుకే ఆయన మహా నాయకుడయ్యారు. జిల్లాలో ఆయన జ్ఞాపకాలు అడుగడుగునా కనిపిస్తాయి.
నేడు వైఎస్సార్ జయంతి
జిల్లాలో రాజన్న జ్ఞాపకాలు
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఓ పరిష్కారం చూపారు. జిల్లా కేంద్రంలో పెద్దాస్పత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశా రు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్రాస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండూ ఆయన చేతులమీదుగానే జరిగాయి. 13 ఆధునిక వసతులతో కూడిన భవనాలను మంజూరు చేసిన ఘనత వైఎస్సార్దే.
నదులున్నా పొలాలు తడవని పరిస్థితి, భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి, సాగు చేద్దామని భావించినా అప్పు పుట్టని రోజులను వైఎస్సార్ చూశారు. అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.50లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు.
2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20మండలాల్లో 2.55 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు.
జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు.
తోటపల్లి ఫేజ్–2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది.
సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 123.25కోట్లతో ఆఫ్షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్–1 పనులను చేపట్టారు.
నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు.
ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ భావించారు. దానిలో భాగంగా జిల్లాకు యూనివర్సిటీని అందించారు. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా యూనివర్సిటీ తీర్చిదిద్దుతోంది.


