
టీడీపీలో వర్గపోరు
ఎచ్చెర్ల: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. శుక్రవారం నిర్వహించిన లావేరు మండల టీడీపీ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన పలు పంచాయతీల తెలుగు తమ్ముళ్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు పాత కమిటీనే కొనసాగించాలని కోరగా, మరికొందరు కొత్త కమిటీను నియమించాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఎంపీ జోక్యం చేసుకుని ఇలా గొడవ చేస్తే సహించేది లేదని చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో లావేరు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. చేసేదేమీ లేక ఎంపీ వెనుదిరిగారు. కాగా, ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా ముప్పిడి సురేష్ కొనసాగుతున్నారు. ఈయన బదులుగా కొత్తపల్లి సర్పంచ్ ఆరవెళ్లి కృష్ణను ఎన్నుకునేందుకు పలు పంచాయతీల టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. దీంతో ఇరువరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఎటూ తేల్చలేక ఎంపీ వాయిదా వేశారు.
లావేరు మండల టీడీపీ కమిటీ ఎన్నిక రసాభాస
తెలుగు తమ్ముళ్ల తోపులాట
రంగంలోకి దిగిన పోలీసులు