
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు బాబు?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రుల కార్యాలయాలు, కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్రాంతిభవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాలంలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఏ ఉపాధి లేనివారు 1.56 కోట్లు మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వేణు, రాము, రామోజీ తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాద ఘటనలో
దురుద్దేశం లేదు : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : హిరమండలంలోని ఆధ్యాత్మిక కేంద్రం కూర్మ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న కూర్మ వద్ద అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వ్యక్తిగతంగా, అల్లరిమూకల ప్రమేయం లేదని, గ్రామస్తులు నిత్యం దీపాలు వెలిగించి పూజ చేసిన అనంతరం దీపాలు ఆర్పేసి వెళ్లిపోతాం అని చెప్పారని.. అయినప్పటికీ ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆరకుండా ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రస్తుతం భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో భౌతికాధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పంపామని, సాంకేతిక ఆధారాలను బట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు అవాస్తవాలు, వదంతులు నమ్మవద్దని, ఎవరైనా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.