ధర్మవరం: ఓటరు జాబితాలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో బీఎల్ఓలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ధర్మవరంలో బీఎల్ఓ (బూత్లెవల్ ఆఫీసర్)లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటి సర్వేకు పూర్తిగా మంగళం పాడారు. అలాగే డోర్ నంబర్లు క్యాన్సిల్ అయిన ఇళ్ల అడ్రెస్లతో ఓట్లు ఎక్కించే విధంగా వ్యవహరిస్తున్నారు.
అందరినీఒకే చోటకు పిలిచి..
17వ వార్డులోని 8వ సచివాలయ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేయాల్సిన బీఎల్ఓ లీలావతి... ఓటర్లను స్థానిక బీఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణకు రమ్మని చెబుతున్నారు. అక్కడే ఓటరు గణన ఫారాలు అందజేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓటరు గణన దరఖాస్తులను అక్కడే పూర్తి చేస్తుండటంతో ప్రజలు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా అయితే బీఎల్ఓ ఇంటింటికీ వెళ్లి ఓటర్లుకు దరఖాస్తులను అందించి... వారు నింపిన తర్వాత మళ్లీ వారి ఇంటి వద్దకే వెళ్లి స్వీకరించాల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం వారికి టీఏ, డీఏలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తోంది. కానీ పట్టణంలో ఇష్టానుసారం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
కూల్చివేసిన ఇళ్ల అడ్రెస్లతో
ఓట్లు ఎక్కించేందుకు ప్రణాళిక
ఇటీవల 17వ వార్డు పరిధిలో కదిరిగేట్ శివానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో దాదాపుగా 80కిపైగా ఇళ్లను కూల్చి వేశారు. ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించడంతో ఇళ్లను పూర్తిగా తొలగించి డోర్నంబర్లను కూడా క్యాన్సిల్ చేసింది. ఇక్కడ నివాసం ఉంటున్న దాదాపుగా 200మందికిపైగా ఓటర్లు పోతులనాగేపల్లి వద్ద ఉన్న జగనన్న లేఅవుట్, ఎల్సీకే పురం, మార్కెట్యార్డులతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాల పరిధిలోని సచివాలయాల్లోనే వారు మ్యాపింగ్ కూడా చేసుకున్నారు. వాస్తవానికి వారి ఓట్లర్ల జాబితా వెరిఫికేషన్ అక్కడే జరగాలి. కానీ సదరు బీఎల్ఓ వారికి ఫోన్లు చేసి క్యాన్సిల్ చేసిన డోర్నంబర్లకే ఓటరు జాబితాలోకి ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై కొంతమంది బీఎల్ఏలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆమె ఖాతరు చేయలేదని వారు చెబుతున్నారు. ఇది ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
ధర్మవరంలో బీఎల్ఓ
నిబంధనల ఉల్లంఘన
అందరినీ ఒకేచోటకు రప్పించి
ఓటరు జాబితా పరిశీలన
8వ వార్డు సచివాలయ పరిధిలో
ఘటన
కూల్చేసిన ఇళ్ల అడ్రెస్లతో
ఓట్లు చేర్చేందుకు ప్రణాళిక


