ప్రశాంతి నిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని , ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. గతంలో ఇచ్చి, పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కలెక్టరేట్కు రాకుండా www. meekosam. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోలీస్ కార్యాలయంలోనూ...
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో ఫిర్యాదు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు.
నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్
పుట్టపర్తి: రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్(మినిమం టైం స్కేల్) టీచర్లకు స్కూళ్ల కేటాయింపు కోసం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం జేఎన్టీయూ రోడ్డులోని జిల్లా సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో అనధికారికంగా గైర్హాజరైనవారు, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభరోజు స్కూళ్లలో జాయిన్ కాని ఎంటీఎస్ టీచర్లకు రెన్యూవల్ చేయబోమన్నారు.
ఎలుగుబంటి హల్చల్
మడకశిర రూరల్: మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సింగేపల్లిలోని బీసీ కాలనీ వద్ద ఎలుగు బంటి హల్ చల్ చేసింది. ఆదివారం ఉదయం బీసీ కాలనీ వద్దకు వచ్చిన ఎలుగు బంటిని గమనించిన కుక్కలు మొరగడంతో కాలనీ వాసులు చూసి కేకలు వేశారు. దీంతో ఎలుగు పొలాల వైపు పరుగులు తీసింది. రాత్రి సమయంలో బయటికి వెళ్లేందుకు భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామం వైపు ఎలుగు బంటి రాకుండా చూడాలన్నారు.
రోడ్డుపై వరినాట్లు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి దళిత కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ , స్థానికులు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాహ్మణపల్లిలో స్థానికులతో కలసి రహదారిపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పుట్టపర్తి మున్సిపాలిటీలో పలు దళిత కాలనీల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. తాగునీటి పైన్ లైన్ల కోసం జేసీబీలతో గుంతలు తవ్వి వదిలేశారన్నారు. సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కాలనీల్లో మౌలిక సదుపాయలు కల్పించడంలోనూ ఎమ్మెల్యే సింధూరారెడ్డి విఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ రోడ్లతో పాటు వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాద్రి, పార్వతి, నరసమ్మ, లక్ష్మీనరసమ్మ, గంగరత్న తదితరులు పాల్గొన్నారు.


