రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. రొళ్ల మండలం టీడీ పల్లి, హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతండా, రొళ్లకొండ, అలుపనపల్లి, ఎ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల నుంచి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. అమ్మవారి మూలవిరాట్ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రత్నగిరి రాజవంశీకులు కుటుంబ సమేతంగా జ్యోతులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో రాజవంశీకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కూడా వివిధ గ్రామల నుంచి జ్యోతులను తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు.


