● ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
మడకశిర రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మెళవాయి గ్రామంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మడకశిర ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్థార్ కళ్యాణచక్రవర్తి, సీఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ సోమశేఖర్రెడ్డి, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, బంధువులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయికి జైలు శిక్ష
హిందూపురం: చెల్లని చెక్కులకు సంబంధించి రెండు కేసుల్లో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రమణయ్య తీర్పు వెలువరించారు. వివరాలు.. హిందూపురం పట్టణానికి చెందిన సరోజాబాయి, పవిత్రకు ష్యూరిటీ కింద చెక్కులు ఇచ్చి చెరో రూ.5 లక్షలు వంతున బద్రి ఫైనాన్స్ నిర్వాహకుడు ఎంఎన్ఎస్ మణి అప్పు చేశాడు. నిర్ణీత గడువు ముగియడంతో ఆ చెక్కులను వారు క్యాష్ చేసుకునేందుకు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అయితే మణి ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు కాస్త చెల్లకుండా పోయాయి. దీంతో వారిద్దరూ సీనియర్ న్యాయవాది సి.రామచంద్రారెడ్డి ద్వారా న్యాయస్థానంలో కేసులు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను విచారించిన న్యాయమూర్తి రమణయ్య... నేరం రుజువు కావడంతో ముద్దాయి ఎంఎన్ఎస్ మణికి ఆరు నెలల జైలుశిక్ష తోపాటు రూ.5 లక్షల వంతున జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై తాను ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు ముద్దాయి అనుమతి కోరగా... బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతిచ్చారు.


