సాయి స్ఫూర్తి.. సేవా దీప్తి
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి చూపిన బాటలో నడుస్తున్న భక్తులు సేవాభావంతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ముఖ్యంగా సత్యసాయిబాబా దర్శనార్థం ప్రశాంతి నిలయానికి వచ్చే విదేశీ భక్తులు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని తమ వంతుగా సహకారం అందిస్తూ విద్యావ్యాప్తికి, పేద ప్రజలకు తోడ్పాటునందిస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా విడదీయరాని బంధం..
పుట్టపర్తితో విదేశీయుల బంధం మూడు దశాబ్దాలుగా సాగుతోంది. తొలినాళ్లలో సత్యసాయి దర్శనార్థం వచ్చే విదేశీ భక్తులు నెలల తరబడి ప్రశాంతి నిలయంలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే సమీపంలోని గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించేవారు. అనంతరం తమవంతుగా సాయం అందించేవారు. ముఖ్యంగా అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే విదేశీయులు వచ్చారంటే గ్రామస్తుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వారికి సాదర ఆహ్వానం పలకడం, పూల మాలలు వేసి సత్కరించడం చేస్తుంటారు. విదేశీయులు కూడా ఆయా గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లి పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కావాల్సిన నోటు పుస్తకాలు, పెన్నులు, దుస్తులు ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత ఉపాధ్యాయుల సూచనలతో పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నారు.
పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా..
● నెదర్లాండ్కు చెందిన ‘లిసాయ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గంగిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలు వెచ్చించి రెండు అదనపు గదులు, రేకుల షెడ్డు, ప్రాథమిక పాఠశాలలో బెంచ్లు, టైల్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ఫిల్టర్ అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ సీపీయూ, ప్రింటర్ అందజేశారు.
● వెంగళమ్మచెరువు, పుట్టపర్తి ఉన్నత పాఠశాలల్లో విదేశీయుల సహకారంతో సుందరవళ్లి అనే భక్తురాలు రూ.5 లక్షల చొప్పున వెచ్చించి రెండు రీడింగ్ షెడ్లు నిర్మింపజేశారు.
● అమగొండపాళ్యం, బొంతలపల్లి, కప్పలబండ, భవిత కేంద్రం తదితర చోట్ల కావాల్సిన మౌలిక వసతులు కల్పించి ఆదుకున్నారు.
చెర్లోపల్లి గ్రామాభివృద్ధికి విశేష కృషి
మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామాభివృద్ధికి విదేశీయులు విశేష సహకారం అందించారు. గ్రీసు దేశానికి చెందిన జార్జి బెబిలిడీస్ బృందం చెర్లోపల్లి అభివృద్ధి బాటలు వేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు గదులతో పాటు విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లకు నూతన సీపీయూలు అందించి విద్యాభివృద్ధికి పాటు పడ్డారు. గతంలో పాఠశాలలో పని చేసిన హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చెర్లోపల్లి పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. తరచూ గ్రామాన్ని సందర్శించే విదేశీయులు విద్య ప్రాముఖ్యను తెలిపేలా పాఠశాల గోడలపై పెయింటింగ్స్తో పాటు దేశ నాయకుల ఫొటోలు వేయించారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి అవసరమైన గ్లాసులు, ప్లేట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు.
సత్యసాయి మార్గాన్ని
అనుసరిస్తున్న విదేశీయులు
ప్రశాంతి నిలయం రాక..
గ్రామాల సందర్శన
సమస్యలు తెలుసుకుని
పరిష్కరిస్తున్న వైనం
పాఠశాలల్లో సౌకర్యాలు,
విద్యా సామగ్రి అందజేత
పాడి ఆవులు, కుట్టుమిషన్ల పంపిణీతో మహిళలకు ఆర్థిక చేయూత
‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అన్న సత్యసాయి బాబా సూక్తిని విదేశీ భక్తులు తూచ
తప్పకుండా పాటిస్తున్నారు. తరచూ ప్రశాంతి నిలయానికి వచ్చే విదేశీయులు తప్పకుండా సమీపంలోని గ్రామాలను సందర్శిస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తీరుస్తూ
సేవాభావాన్ని చాటుతున్నారు.
మహిళాభివృద్ధికి చేయూత..
మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు కూడా విదేశీయులు చేయూత ఇచ్చారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాల్లోని పాడి రైతులను గుర్తించి పాడి ఆవులను అందజేశారు. అలాగే పుట్టపర్తి మండలం పెడపల్లిలో పలువురు మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఇలా ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారు.
సాయి స్ఫూర్తి.. సేవా దీప్తి
సాయి స్ఫూర్తి.. సేవా దీప్తి
సాయి స్ఫూర్తి.. సేవా దీప్తి


