వారి సంకల్పం అ‘పూర్వ’ం | - | Sakshi
Sakshi News home page

వారి సంకల్పం అ‘పూర్వ’ం

Jun 16 2025 7:11 AM | Updated on Jun 16 2025 7:11 AM

వారి సంకల్పం అ‘పూర్వ’ం

వారి సంకల్పం అ‘పూర్వ’ం

చూపులతో పుట్టి.. మాటలతో మొదలయ్యేది కాదు స్నేహం..మనసులో పుట్టి.. మట్టిలో కలిసేంత వరకూ తోడుండేదే అసలైన స్నేహం. ఎందరో కవులు..

ఇంకెందరో స్నేహితులు.. స్నేహబంధాన్ని, అందులోని మాధుర్యాన్ని ఎన్నో రకాలుగా నిర్వచించి ఉండవచ్చు. అయితే స్నేహం ఏ నిర్వచనానికి అందనంత గొప్పది. ఏ బంధానికీ సాటిరానంత ఉన్నతమైనదని నిరూపించారు తాడిపత్రి ప్రాంతానికి చెందిన పూర్వ విద్యార్థులు. తమలో ఒకరికి కలిగిన కష్టం, నష్టం... తమందరిదిగా భావించారు. బాధపడిపోయారు. దాన్నుంచి స్నేహితుడి కుటుంబాన్ని బయటపడేసేందుకు ఏకమయ్యారు.

తాడిపత్రి టౌన్‌/పుట్లూరు: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగారు. తాడిపత్రిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2004–07 విద్యాసంవత్సరంలో (ఎంపీసీ) చదువుకుంటున్న సమయంలో స్నేహితులుగా మారారు. చదువుల అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు. అయితే 18 ఏళ్ల తర్వాత తమ స్నేహితులందరినీ కలుసుకోవాలని పూర్వవిద్యార్థులు నాగరంగయ్య, ప్రతాప్‌ భావించారు. అనుకున్నదే తడవుగా స్నేహితుల గురించి ఆరా తీస్తూ 42 మందిలో ఇప్పటి వరకూ 15 మందితో మాట్లాడి గెట్‌ టు గెదర్‌ ఏర్పాటుకు సన్నాహాకాలు మొదలు పెట్టారు. మిగిలిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగున్నా.. చదువుకుంటున్న సమయంలో తమను ఎంతో నవ్వించే కొండయ్య ఆచూకీ ఒక్కటే దొరకలేదు. కేవలం ఊరి పేరు మాత్రమే తెలుసు.

పూట గడవని స్థితిలో స్నేహితుడి కుటుంబం

కొండయ్య స్వగ్రామం పుట్లూరు మండలం అరకటివేముల కావడంతో ఆ గ్రామానికి చెందిన కొందరితో కొండయ్య గురించి నాగరంగయ్య, ప్రతాప్‌ ఆరా తీశారు. ‘అయ్యో! ఇంకెక్కడి కొండయ్య.. ఏడాది క్రితం గుండె పోటుతో చనిపోయాడు కదబ్బా!!’ అంటూ గ్రామస్తులు తెలపడంతో ఒక్కసారిగా స్నేహితులు కంగు తిన్నారు. ఆస్తిపాస్తులు ఏమీ లేని కొండయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారని... తల్లి అంకాలమ్మ, భార్య రాజ్యలక్ష్మి కూలి పనులతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని తెలుసుకున్న నాగరంగయ్య, ప్రతాప్‌ విషయాన్ని వెంటనే మిగిలిన స్నేహితులందరికీ చేరవేశారు. అందరి హృదయాలు బరువెక్కాయి. సంతోషంగా గడపడానికి ఎప్పుడైనా కలుసుకోవచ్చునని, అంతకు ముందు కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో గెట్‌ టు గెదర్‌ కోసం సిద్ధంగా ఉంచుకున్న రూ.1.25 లక్షలను కొండయ్య కుమార్తె సాహితి పేరున పోస్టాఫీస్‌లో డిపాజిట్‌ చేశారు. నెలకు సరిపడ సరుకులు తీసుకుని ఆదివారం అరకటివేములకు చేరుకుని కొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమతో పాటు తీసుకెళ్లిన సరుకులు, డిపాజిట్‌ బాండ్‌ను అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒకరి కష్టాన్ని అందరిదిగా భావించి స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న తీరును అభినందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జయచంద్ర, ప్రతాప్‌రెడ్డి, నాగరంగయ్య, ఓబులేసు, వెంకట్‌, మల్లికార్జున, నరేంద్ర, రమేష్‌, కులశేఖర్‌, లక్ష్మీనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

కష్టాల్లో ఉన్న మిత్రుడి కుటుంబానికి బాసట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement