
డబ్బు కోసం సొంత బిడ్డ విక్రయం!
సోమందేపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ యువకుడు డబ్బు కోసం తన కుమార్తెనే విక్రయించాడు. ఆరు నెలల క్రితం ఈ ఘటన జరుగగా.. ఆదివారం వెలుగు చూసింది.
రెండేళ్ల క్రితం ఓ బాలిక అదృశ్యం..
పెనుకొండకు చెందిన ఖలీల్ కుమార్తె నాలుగేళ్ల వయసున్న సాఫియా 2023, జూన్ 12న కనిపించకుండా పోయింది. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ ఆచూకీ గుర్తించలేకపోయారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
నిలదీయడంతో ఆత్మహత్యాయత్నం..
శనివారం ఉదయం ఖలీల్ ఇంటికి సమీప బంధువు, అనంతపురానికి చెందిన బాబ్జాన్ వెళ్లాడు. అయితే గతంలో బాబ్జాన్ తన సొంత కుమార్తెను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న విషయం తెలుసుకున్న ఖలీల్ కుటుంబసభ్యులు అతన్ని గట్టిగా నిలదీశారు. తమ కుమార్తె సాఫియా అదృశ్యం వెనుక బాబ్జాన్ హస్తమున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. డబ్బు కోసం సాఫియాను కూడా అపహరించి విక్రయించావంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన బాబ్జాన్ నిద్రమాత్రలు మింగడంతో వెంటనే పెనుకొండలోని వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని జరిగిన ఘటనపై బాబ్జాన్తో ఆరా తీశారు.
సొంత బిడ్డనే అమ్ముకున్నా..
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆరు నెలల క్రితం తన సొంత కుమార్తెనే హిందూపురం ప్రాంతంలో విక్రయించినట్లు బాబ్జాన్ తెలిపాడు. ఇందుకు పెనుకొండలోని దర్గాపేటకు చెందిన ఓ మహిళ సహకరించిందన్నాడు. అయితే 2023లోనే సదరు మహిళ తనను సంప్రదించిందని, ఆ సమయంలో సాఫియాను అపహరించుకొస్తే విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకుందామని ఆమె తెలిపిందని గుర్తు చేశాడు. ఇందుకు అప్పట్లో తాను ఒప్పుకోలేదన్నాడు. అయితే డబ్బు అవసరం కావడంతో ఆరు నెలల క్రితం తన సొంత కుమార్తెను సదరు మహిళ ద్వారా విక్రయించిన మాట వాస్తవమని బహిర్గతం చేశాడు.
పక్కదారి పట్టిన విచారణ?
బాలిక మిస్సింగ్ కేసులో ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి సాధించని పెనుకొండ పోలీసులు తాజాగా వెలుగు చూసిన బాలిక విక్రయం కేసులో విచారణను సైతం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబ్జాన్ స్పష్టంగా తన కుమార్తెను విక్రయించినట్లుగా మీడియా, పోలీసుల సమక్షంలో అంగీకరించినా కేసు నమోదులో తాత్సారం చేస్తూ అనంతపురంలోని చైల్డ్, ఉమెన్ ప్రోటెక్షన్ సెల్కు సమాచారం అందించి చేతులు దులుపుకున్నారు. సమాచారం అందుకుని అనంతపురం నుంచి ఛైల్డ్, ఉమెన్ ప్రోటెక్షన్ సెల్కు చెందిన ఏఎస్ఐ పెనుకొండలోని ఆస్పత్రికి చేరుకుని బాబ్జాన్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్గాపేటకు చెందిన మహిళనూ విచారణ చేశారు. అనంతరం బాబ్జాన్ తన ఇష్టపూర్వకంగానే కుమార్తెను విక్రయించాడని, సాఫియా అదృశ్యమైన ఘటనలో అతని ప్రమేయం లేదని, అలాగే దర్గాపేటకు చెందిన మహిళ కూడా అలాంటి వ్యక్తి కాదని స్థానిక పోలీసులకు మహిళా ఏఎస్ఐ తెలిపి వెళ్లిపోయారు. తన కుమార్తెనే విక్రయించినట్లు మీడియా సమక్షంలో పోలీసులకు బహిర్గతం చేసిన బాబ్జాన్పై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరింత లోతుగా విచారణ చేపడితే సాఫియా అదృశ్యం వెనుక మిస్టరీ బయటపడే అవకాశముందని, ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రెండేళ్ల క్రితం పెనుకొండలో
బాలిక అదృశ్యం
బంధువుపైనే అనుమానాలు
చిన్నారి అదృశ్యంతో
తనకు సంబంధం లేదని వెల్లడి
ఆరు నెలల క్రితం తన సొంత బిడ్డనే అమ్ముకున్నట్లుగా బహిర్గతం