
లేని ఖాళీ చూపించి.. వేదన మిగిల్చి
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీల్లో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఒక స్కూల్లో ఖాళీ లేకపోయినా ఉన్నట్లు చూపించారు. అక్కడ కోరుకున్న టీచరుకు అసలు విషయం ఆలస్యంగా తెలిసి లబోదిబోమంటున్నారు. ఏర్పడే ఖాళీల్లో కేటాయించి న్యాయం చేస్తామంటూ అధికారులు భరోసా ఇచ్చినా... బాధిత టీచరులో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి కౌన్సెలింగ్ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. శెట్టూరు మండలం బలపంపల్లి పాఠశాలలో పని చేస్తున్న వరలక్ష్మీ 8 ఏళ్లు సర్వీస్ పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో సీరియల్ నంబరు 2,109లో ఉన్న ఆమె శనివారం రాత్రి కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఆప్షన్లు తీసుకునే క్రమంలో గుత్తి మండలం ఓపెన్ చేయాలని కోరారు. ఆ మండలంలో మామడూరు పాఠశాలలో ఖాళీ చూపించడంతో ‘ఆప్ట్’ చేసుకున్నారు. అధికారులు ధ్రువీకరించి సంతకం కూడా తీసుకున్నారు.
ఆలస్యంగా తేరుకున్న టెక్నికల్ బృందం
వాస్తవానికి మామడూరు పాఠశాలలో నాలుగు మంజూరు పోస్టులున్నాయి. ఇందులో ఒకరు పని చేస్తుండగా మూడు క్లియర్ వేకెన్సీలున్నాయి. ఈ మూడు ఖాళీలను అంతకముందే కోరుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా మరో ఖాళీ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ విషయం విద్యాశాఖ అధికారులతో పాటు సిబ్బందికి, సాంకేతిక నిపుణులకూ తెలుసు. వరలక్ష్మీ కోరుకునే సమయంలో వీరెవరూ గుర్తించలేదు. తీరా కోరుకుని నిర్ధారణ పూర్తయిన తర్వాత తేరుకున్నారు. పోస్టు లేని స్కూల్కు వెళ్తే జీతం సమస్య ఉత్పన్నమవుతుంది. గాలిలో ఉండాల్సిందే. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ డీఈఓ వద్ద మొరపెట్టుకున్నారు. పొరబాటు జరిగిందని బదిలీల్లో ఏర్పడే ఖాళీల్లో కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారు.
నేటి కౌన్సెలింగ్ వేదిక మార్పు..
ఆర్డీటీ అంధుల పాఠశాల నుంచి ఆదివారం పంగల్ రోడ్డు సమీపంలోని సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్కు కౌన్సెలింగ్ కేంద్రం మార్పు చేస్తున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు సీనియార్టీ జాబితాలో క్రమసంఖ్య 3,001
నుంచి 3,500 హాజరుకావాలని, సాయంత్రం 4 గంటలకు 3,501
నుంచి చివరి
సంఖ్య 3,881 వరకు హాజరుకావాలని సూచించారు. అలాగే ఉర్దూ, కన్నడ బదిలీలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.
నేడు పీఈటీలు కొత్త స్కూళ్లల్లో చేరాలి..
బదిలీ అయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఆదివారం కొత్త స్కూళ్లల్లో చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 32 మంది పీఈటీలు బదిలీ అయ్యారు. వీరంతా వెబ్ ఆప్షన్లు పెట్టారు. ఆర్డర్లు కూడా జనరేట్ అయ్యాయి. అందరూ ఆదివారం కొత్త స్కూళ్లల్లో చేరాలని సూచించారు.
ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో మాయ
కోరుకున్న తర్వాత తేరుకున్న
అధికారులు
లబోదిబోమన్న బాధిత టీచరు

లేని ఖాళీ చూపించి.. వేదన మిగిల్చి