
జవాన్ కుటుంబానికి చెక్కు పంపిణీ
గోరంట్ల: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ కుటుంబానికి జనసేన తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయం అందిస్తానని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అధినేత ఆదేశాల మేరకు తిరుపతి ఎమ్మేల్యే అరని శ్రీనివాసరావు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి తదితరులు శనివారం కల్లితండాకు చేరుకుని రూ.25 లక్షల చెక్కును జవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్కు అందజేశారు. ఈ సందర్భంగా జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు తీవ్రగాయాలు
కనగానపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. రామగిరి మండలం కలికివాండ్లపల్లికి చెందిన వడ్డే ముసలప్ప, ముత్యాలమ్మ దంపతులు శనివారం ధర్మవరానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. కనగానపల్లి మండలం దాదులూరు వద్దకు రాగానే వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. బైకులోంచి ఎగిరిపడ్డ ముసలప్ప, ముత్యాలమ్మకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు 108 అంబులెన్సులో అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ముసలప్ప పరిస్థితి విషమంగా ఉంది.
ద్విచక్రవాహనదారుడి మృతి
గోరంట్ల: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. బుగానిపల్లికి చెందిన నంజుండప్ప (55) శనివారం గోరంట్ల నుంచి గుమ్మయ్యగారిపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఇదే సమయంలో గుమ్మయ్యగారిపల్లి వైపు నుంచి ప్రకాష్ అనే వ్యక్తి వస్తున్నాడు. స్థానిక హిందూపురం – గోరంట్ల ప్రధాన రహదారిపై బజాజ్ షోరూమ్ సమీపంలోకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నంజుండప్ప తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
అనంతపురం: బీటెక్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురంలోని అశోక్నగర్లో నివాసం ఉంటున్న నాగలింగమయ్య కూతురు సునీత (25) బీటెక్ చదువుతోంది. మూడేళ్లుగా సబ్జెక్టులు ఫెయిలవుతూనే ఉంది. తాజా ఫలితాల్లో కూడా పాస్ కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఎవరూ లేని సమయంలో బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో మరొకరు..
కళ్యాణదుర్గం రూరల్: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణదుర్గానికి చెందిన వన్నూరుస్వామి (32) నర్సరీ నిర్వహిస్తూ భార్య, కొడుకు, కూతురును పోషించుకుంటున్నాడు. నర్సరీ నిర్వహణ కోసం రూ.7లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. అప్పటికే వన్నూరుస్వామి మృతి చెందాడు.

జవాన్ కుటుంబానికి చెక్కు పంపిణీ