● మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్
కాకాణి పూజితా రెడ్డి
పొదలకూరు: ‘కూటమి పాలనలో అత్యవసర సేవలు అటకెక్కాయి. రోడ్డు ప్రమాదాలు జరిగితే స్పందన సక్రమంగా ఉండటం లేదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిండెంట్ కాకాణి పూజితా రెడ్డి అన్నారు. ఇటీవల మార్కాపురం సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన 14 మందిలో ఒకరైన పొదలకూరు పంచాయతీ వెంకటేశ్వరనగర్కు చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని సోమవారం పూజిత పరామర్శించారు. పార్టీ ప్రకటించిన రూ.లక్ష నగదును మృతుడి సతీమణి మమతకు పూజిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టి పెట్టకుండా అక్రమ కేసులతో పాలన చేస్తున్నట్టు విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉన్నారని, ప్రమాదాలపై స్పందించడం లేదని ఆరోపించారు. పోయిన ప్రాణాలు వెనక్కు తీసుకురాలేమని కనీసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకై నా ముందుకు రావాల్సిందిగా సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర సేవలు సక్రమంగా అందడం లేదని, 108 అంబులెన్స్ల సేవలు పడకేసినట్టు పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల్లో ఏర్పడే సాంకేతిక లోపాల వల్ల వరుస ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 108 అంబులెన్స్లకు ఎంతో ప్రాధాన్యమిచ్చారన్నారు. ప్రమాదాలు సంభవించిన వెంటనే క్షతగాత్రులను 108 వాహనాలు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లేవన్నారు. పట్టణంలోని యాదవవీధిలో రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న పడవల శ్రీనివాసులును పూజిత పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు జి.లక్ష్మికల్యాణి, జి.శ్రీనివాసులు, చెమికల వెంకటేశ్వర్లు, రావుల ఇంద్రసేన్గౌడ్, పి.శంకరయ్య, జే.రామచంద్రయ్య, ఎ.వెంట్రామిరెడ్డి, ఎస్కే అంజాద్, డీ.విజయభాస్కర్రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


